డైరెక్టర్ శంకర్.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాప్ దర్శకుడు. పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇప్పుడు ఆయన తనయ అదితి శంకర్ కథానాయికగా రాణిస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా స్పెషల్ ఇమేజ్ కోసం కష్టపడుతుంది.
తాజాగా ఆమె హీరో శివకార్తికేయన్ నటించిన మావీరన్ చిత్రంలో నటించింది. మండేలా చిత్రం ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 14న రిలీజ్ కానుంది.
ఇందులో అదితి శంకర్ పాత్రికేయురాలిగా చురుకైనా పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి.
ఎంబీబీఎస్ పూర్తిచేసిన అదితి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి వచ్చేందుకు తన తండ్రి శంకర్ ముందు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.
సినీరంగంలో నిలబడాలంటే చాలా కష్టపడాలని.. అందుకు తన పేరు ఉపయోగించుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించమని చెప్పారట. ఏడాదిలోపు ఏ ఛాన్స్ రాకపోతే మరోసారి ఇండస్ట్రీ పేరెత్తకూడదు అని షరతు పెట్టారట. కానీ ఇప్పుడు అదితికి వరుస అవకాశాలు వస్తున్నాయి.
అయితే స్టార్ డైరెక్టర్ కూతురు అయినా అదితికి కథానాయికగా అవకాశాలు వచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం తక్కువగానే ఉందట. ప్రస్తుతం ఆమె ఒక్కో మూవీకి రూ.25 లక్షలు తీసుకుంటుందట.
ఇక తనకు దర్శకత్వం చేసే ఆలోచన ఏమాత్రం లేదని.. కానీ తన తండ్రి డైరెక్షన్ లో మాత్రం నటించాలని ఉందని తెలిపింది.