
సిల్క్ స్మిత, సావిత్రి లాంటి హీరోయిన్ల బయోపిక్స్ ఇప్పటికే ఎగబడి చూసారు ఆడియన్స్. ఇదే కోవలో ఇప్పుడు మరో సెన్సేషనల్ బయోపిక్కు రంగం సిద్ధమవుతుందా..? మరో హీరోయిన్ జీవిత చరిత్ర తెరపైకి రాబోతుందా..? 19 ఏళ్లకే ఇండియన్ సినిమాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న దివ్య భారతి లైఫ్ స్టోరీ రెడీ అవుతుందా..? ఒకవేళ అదే నిజమైతే ఆ పాత్రలో నటిస్తున్నదెవరు..?

ఇండస్ట్రీ ఏదైనా బయోపిక్స్కు గిరాకీ మాత్రం బాగానే ఉందిప్పుడు. అందులోనూ కాస్త కాంట్రవర్సీలు ఉన్న సెలబ్రిటీస్ లైఫ్ అయితే అంచనాలు డబుల్ అవుతాయి. అందుకే సిల్క్ స్మిత బయోపిక్గా వచ్చిన డర్టీ పిక్చర్ పదేళ్ల కిందే 100 కోట్లు వసూలు చేసింది. ఇక మహానటిగా వచ్చిన సావిత్రి లైఫ్ని ఎగబడి చూసారు ప్రేక్షకులు. ఈ రెండు సినిమాలతో అటు విద్యా బాలన్.. ఇటు కీర్తిసురేష్ నేషనల్ అవార్డులు అందుకున్నారు.

సిల్క్, సావిత్రి జీవితాల్లో ఓ సినిమాకు సరిపోయేంత మసాలాలున్నాయి.. ట్విస్టులున్నాయి. ఈ లైన్లోనే తాజాగా దివంగత నటి దివ్య భారతి బయోపిక్ రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. 1974లో జన్మించిన ఈమె.. 1993లో కేవలం 19 ఏళ్ల వయసులోనే ముంబైలో అనుమానాస్పద రీతిలో కన్ను మూసారు. ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఇదే కథతో మలయాళ దర్శకుడు అరుణ్ గోపీ బాంద్రా సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

1990లో బొబ్బిలి రాజాతో టాలీవుడ్కు పరిచయమైన దివ్య భారతి.. మూడేళ్ల టైమ్లోనే చిరు, బాలయ్య, వెంకీ, మోహన్ బాబు లాంటి హీరోలతో నటించారు. హిందీలోనూ షారుక్ సహా అగ్ర హీరోలతో రొమాన్స్ చేసారు. మూడేళ్లలోనే 30 సినిమాలకు పైగా నటించిన దివ్య హఠాన్మరణం అభిమానులకు షాక్. ఇప్పుడు బాంద్రా సినిమాలో దివ్య పాత్రనే తమన్నా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

దివ్య భారతి కారెక్టర్ అని మేకర్స్ చెప్పట్లేదు కానీ.. ఒకవేళ అదే అయితే మాత్రం మరో సంచలనమే అవుతుంది సినిమా. దివ్య భారతి మరణం మిస్టరీగానే ఉంది. బాంద్రా సినిమాలో ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.