'ది కేరళ స్టోరీ' మూవీతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ అదా శర్మ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తొలుత ఈ మువీపై విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణ బాగానే దక్కించుకుంది. ప్రస్తుతం ఆదా శర్మ నటించిన వెబ్ సిరీస్ 'కమాండో' విడుదలకు సిద్దంగా ఉంది.
ప్రముఖ దక్షిణాది హీరోయిన్ అదాశర్మ మంగళవారం (ఆగస్టు 2) ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన డయేరియా, ఫుడ్ ఎలర్జీతో నటి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స జరుగుతోంది. 'కమాండో' వెబ్ సిరీస్ విడుదలకు ముందు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం చర్చణీయాంశంగా మారింది.
ఫుడ్ ఎలర్జీ కారణంగా ఆమె శరీరంపై దద్దుర్లు వచ్చాయని, తీవ్రమైన కడుపు నొప్పితో పాటు విరేచనాలతో బాధపడుతుందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు.
'కమాండో' యాక్షన్-థ్రిల్లర్ వెబ్ సిరీస్లో భావనా రెడ్డి పాత్రలో కనిపించనుంది నటి ఆదా శర్మ. ఈ సిరీస్లో ఆదాశర్మతోపాటు ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్కు విపుల్ దర్శకత్వం వహించారు.
'ది కేరళ స్టోరీ'తో ఘన విజయం అందుకున్న ఆదాశర్మ నటించిన వెబ్ సిరీస్ ఇదే. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ, హాట్స్టార్లో విడుదలకు సిద్ధంగా ఉంది.