సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 20 నుంచి హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
మల్టీ ఆర్గాన్స్ పూర్తి గా డ్యానేజ్ అవ్వడంతో శరత్ బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుమారు 250కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన శరత్ బాబు మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
1973లో రామరాజ్యంతో సినీ రంగ ప్రవేశం చేశారు శరత్బాబు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు.
సిల్వర్స్క్రీన్ మీద వెలుగుతూ టీవీల్లో నటించిన నటుల్లో శరత్బాబుది ప్రత్యేకమైన స్థానం. తమిళ దూరదర్శన్లో వచ్చే పలు ధారావాహికల్లో నటించారు. తెలుగులోనూ పలు సీరియళ్లలో నటించారు.
మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా... మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, జీవనజ్యోతి... అభినందన, స్వాతిచినుకులు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను... శంకర్దాదా జిందాబాద్, శ్రీరామదాసు, ఆట, శౌర్యం, సాగరసంగమం... షిరిడిసాయి, ఎంత మంచివాడవురా, వకీల్ సాబ్ చిత్రాల్లోని పాత్రలకు మంచి గుర్తింపుదక్కింది.
స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతాననే శరత్బాబు ఏడు పదుల వయసులోనూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టకపోయినా, చేసిన ప్రతి పాత్రనూ ప్రేమించే చేశానని అనేవారు శరత్బాబు.
కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే రమాప్రభను వివాహం చేసుకున్నారు శరత్బాబు. అప్పటికే రమాప్రభ హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నంబియార్ కుమార్తె స్నేహను పెళ్లాడారు. పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు
శరత్బాబు నటనను మెచ్చుకున్నవాళ్లందరూ సహజ నటుడు అని అంటారు. కానీ ఆయన మాత్రం పేరుకు ముందూ వెనుకా ఏమీ ఉండకూడదని అనుకునేవారు. ఎవరైనా సహజనటుడు అని పిలిచినప్పుడు మాత్రం ఆయన ముఖంపై వెలుగు కనిపించేది.
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకలోకాన్ని అలరించిన గంభీర స్వరం మూగబోయింది. తిరిగిరాని లోకాలకు తరలివెళ్లింది. శరత్బాబు మనతో లేకపోవచ్చు. కానీ నాలుగున్నరదశాబ్దాలకుపైగా ఆయన నటించిన పాత్రలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.
పవన్ కల్యాణ్ నటించిన వకీల్సాబ్లో చివరి సారి స్క్రీన్ మీద కనిపించారు శరత్ బాబు . ఆయన నటించిన ఆఖరి సినిమా మళ్లీ పెళ్లి మే 26న రిలీజ్ కానుంది.