
నందమూరి కుటుంబాన్ని ప్రమాదాలు.. హఠాన్మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొందరు ప్రమాదాల్లో మరణిస్తే.. మరికొందరు గుండెపోటుతో మృతి చెందడం అంతులేని శోకాన్ని మిగుల్చుతోంది.

మొదట ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన సినీ పరిశ్రమలో నిర్మాతగా కొనసాగారు. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం త్రివిక్రమరావును బలి తీసుకుంది.

త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు. మనుషుల్లో దేవుడు చిత్రం ద్వారా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన హరిన్, 1986లో మామ కోడళ్ల సవాల్ ద్వారా హీరోగా మారాడు. అయితే నటుడిగా ఎదుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు హరిన్ చక్రవర్తి. సోదరుడి హరీన్ చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ రోడ్ యాక్సిడెంట్ లో మృతితో కల్యాణ్ చక్రవర్తి సినిమాలకు గుడ్బై చెప్పేసి చెన్నైలో స్థిరపడ్డాడు.

ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోవడం నందమూరి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.

నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో పల్టీ కొట్టింది. దీంతో హరికృష్ణ ను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. 2018 ఆగస్ట్ 29న మృతి చెందాడు హరికృష్ణ.

నల్లగొండ జిల్లాలోని ఆకుపాముల దగ్గర జానకీరామ్ ప్రయాణిస్తున్న సఫారీ కారు , ట్రాక్టర్కు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 2014 డిసెంబర్ 6న మరణించారు నందమూరి జానకీరామ్.

అటు నటుడిగా, ఇటు రాజకీయంగా ఎదుగుతున్న తారకరత్న మృతి చెందడం ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో తీరని శోకాన్ని మిగిల్చింది.