
ఆదాయ పన్ను శాఖ లేదా ఇతర అధికారులు మన వద్ద నియమాలకు మించిన నగదును పట్టుకుంటే ఆ డబ్బు ఏ విధంగా సంపాదించాం లేదా మన వద్దకు ఎలా వచ్చింది అనే వివరాలను వారికి తెలియజేయాలి. ఆదాయాన్ని చూపించడానికి మన వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలు కూడా ఉండాలి. అదే విధంగా అన్ని రకాల పన్నులను, ఆదాయపు పన్నును సమయానికి చెల్లించామని వారి ఎదుట నిర్ధారించుకోవాలి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకారం మన వద్ద నుంచి ఆదాయ పన్ను శాఖాధికారులు పట్టుకున్న డబ్బు మూలాన్ని చూపించలేకపోతే జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా రికవరీ చేసిన డబ్బులో 137 శాతానికి సమానమైన మొత్తంలో ఉండవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలను చేస్తే జరిమానా విధించవచ్చు. మీరు రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ లేదా విత్డ్రా చేయవలసి వస్తే, మీరు మీ పాన్ వివరాలను బ్యాంకుకు తప్పనిసరిగా అందించాలి.

ఒక వ్యక్తి రూ. 1,20,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, అతను/ఆమె పాన్, ఆధార్ కార్డు వివరాలను సమర్పించాలి.

నగదు రూపంలో మీరు రూ.2 లక్షలకు మించి ఖర్చు చేయలేరు. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తే, మీరు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా అందించాలి.

క్రెడిట్-డెబిట్ కార్డులను ఉపయోగించి రూ. 1 లక్ష కంటే ఎక్కువ చెల్లించే వ్యక్తి ఆదాయ పన్ను కంటి కిందకు రావచ్చు.

రూల్స్ ప్రకారం మీరు మీ స్నేహితుడు లేదా బంధువుల నుంచి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోకూడదు. ఒక వేళ అలా చేయవలసి ఉంటే బ్యాంక్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది.

ఏదైనా బ్యాంకు నుంచి రూ.2 కోట్ల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేసుకుంటే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.