
మరో రెండు రోజుల్లో మార్చి నెల వచ్చేస్తోంది. కొత్త నెల వస్తుండటంతో ప్రజలను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి వస్తున్నాయి. వీటి గురించి ముందే అవగాహన పొంది ఉండాల్సిన అవసరముంది. మార్చి 1 నుంచి వాట్సప్, టెలిగ్రాం లాంటి యాప్స్కు సంబంధించి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అదేంటంటే.. మీ ఫోన్లో సిమ్ లేకపోతే బంద్ కానున్నాయి.

ఈ క్రమంలో మార్చి 1 నుంచి వాట్సప్కు సిమ్ కార్డ్ బైండింగ్ నిబంధన అమల్లోకి రానుంది. దీంతో ఫోన్లో సిమ్ లేకపోతే మీరు ఇక వాట్సప్ వాడలేరు. వాట్సప్ ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. ఇప్పటివరకు సిమ్ ఒక ఫోన్లో ఉన్నా.. వేరే ఫోన్లో వాట్సప్ వాడుకునే సౌకర్యం అందుబాటులో ఉండేది.

వాట్సప్ లాంటి సోషల్ మీడియా యాప్స్కు సిమ్ బైండింగ్ నిబంధనను కేంద్రం టెలికాం విభాగం తప్పనిసరి చేసింది. అక్రమాలకు అరికట్టేందుకు, సైబర్ నేరాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నవంబర్లో ఈ ప్రకటన చేయగా.. అమలు చేసేందుకు సోషల్ మీడియా సంస్థలకు ఫిబ్రవరి 28 వరకు గడువిచ్చింది. ఆ గడువు రేపటితో ముగియనుంది.

కానీ ఇక నుంచి మీరు వాట్సప్ వాడాలంటే సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకపోతే యాప్ ఆగిపోతుంది. ఇక వాట్సప్ వెబ్ కూడా ప్రతీ 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోనుంది. ఇక ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసివేసినా యాప్స్ పనిచేయవన్నమాట. మళ్లీ వాడాలంటే సిమ్ కార్డు వేసుకోవాల్సి ఉంటుంది

ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ సమయంలో మాత్రమే ఫోన్లో సిమ్ కార్డు ధృవీకరణను అడుగుతున్నాయి. ఒకసారి ఈ ధ్రువీకరణ ప్రాసెస్ అయ్యాక సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్, అరట్టై లాంటి సోషల్ మీడియా యాప్స్ పనిచేస్తున్నాయి. దీని వల్ల సైబర్ నేరగాళ్లు యాప్స్ను ఉపయోగించి అక్రమాలకు పాల్పడం ఈజీగా మారింది. ఈ సిమ్ బైండింగ్ నిబంధన వల్ల అక్రమాలు ఆగిపోనున్నాయి.