
మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ రిలయన్స్ జియో సత్తా చాటింది. ఈ కాలానికి కంపెనీ రూ.18,278 కోట్ల ఆదాయంపై రూ.3,508 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 19 శాతం మాత్రమే పెరిగింది. నికర లాభం మాత్రం 47.5 శాతం మేర పెరిగింది.

ఆర్థిక సంవత్సరం 2020-21 మొత్తానికి జియో రూ.73,503 కోట్ల ఆదాయంపై రూ.32,359 కోట్ల స్థూల లాభం, రూ.12,537 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే కరోనా సవాళ్లు ఉన్నా జియో నెట్వర్క్.. ఆదాయం, లాభాలు పెంచుకోగలిగిందని ఆర్ఐఎల్ ప్రకటించింది.

ఇదే సమయంలో ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే రూ.151 నుంచి రూ.138.2కు పడిపోయినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. క్యూ4లో జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం 47.5 శాతం పెరగడం విశేషం. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల విధానం నుంచి బిల్ అండ్ కీప్ విధానానికి మారడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది.

మార్చి త్రైమాసికం లోనూ దేశీయ టెలికాం రంగంలో జియో తన సత్తా చాటుకుంటూ వస్తోంది. గత నెలాఖరు నాటికి ఖాతాదారుల సంఖ్య 42.6 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే జియో ఖాతాదారుల సంఖ్య 1.54 కోట్లు పెరిగింది.