
మీరు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ నిధి వాయిదా కోసం కోట్లాది మంది రైతుల నిరీక్షణ నేటితో ముగియనుంది. అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 18వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్ల సాయం అందించనున్నారు. పీఎం కిసాన్ పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం తప్పుకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ పర్ స్కీంగా మారింది.

'వెబ్కాస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రెండున్నర కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐదు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.

ఈ పథకం కింద ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.6000 జమ చేస్తోంది కేంద్రం. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు, 23,300 కోట్ల విలువైన వ్యవసాయం, పశుసంవర్ధకానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటలకు థానేలో 32,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు.

సాయంత్రం 6 గంటలకు, బికెసి మెట్రో స్టేషన్ నుండి బికెసి నుండి ఆరే జెవిఎల్ఆర్, ముంబై మధ్య నడిచే మెట్రో రైలును ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. అలాగే బీకేసీ, శాంటాక్రూజ్ స్టేషన్ మధ్య మెట్రోలో కూడా ప్రయాణించనున్నారు మోడీ.