
Premiums Increase: ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. మార్పులతో బీమా ప్రిమియంలు పెరగవచ్చని, ఇదే జరిగినట్లయితే పాలసీదారులు ఇబ్బంది పడతారని తెలిపింది. వ్యక్తిగత బీమా, ప్రయాణ బీమా కవరేజీల జోలికీ వెళ్లరాదని తెలిపింది.

పాలసీదారుల అంగీకారంపై స్టాండలోన్ ప్రీమియం రేటుతో ప్రస్తుత ప్రయోజనాలకు కొత్త వాటిని జత చేసుకోవచ్చని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది. అలాగే ఆరోగ్య బీమా వ్యాపారంలో పాలసీల కోసం గత ఏడాది జూలైలో జారీ చేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. ఇక పాలసీల లాభాలు కస్టమర్లందరికీ సులభంగా అర్థం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది.

అలాగే బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతానికి పెంచేందుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి ఎఫ్డీఐ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామణ్ అన్నారు.

ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఓ కీలక నిర్ణయం వెల్లడించింది. ఆరోగ్య బీమా ఉన్నవారు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రియాక్షన్కు గురై ఆస్పత్రిలో చేరినట్లయితే ఆ ఖర్చులు బీమా పరిధిలోకి వస్తాయని గురువారం ప్రకటించారు.

ఈ నెలాఖరు వరకు మెచ్యూరిటీ క్లెయిమ్ డాక్యుమెంట్లను పాలసీదారులు తమ సమీప ఎల్ఐసీ కార్యాలయంలో సమర్పించి సెటిల్మెంట్ చేసుకోవచ్చని ఎల్ఐసీ పేర్కొంది. ఈ నిర్ణయం జోన్లు, డివిజన్లు, శాఖలు అనే తేడా లేకుండా వర్తిస్తుందని ఎల్ఐసీ స్పష్టం చేసింది.

ఇక దేశంలో అందరికీ ఆరోగ్య బీమాను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్య సంజీవని పాలసీ కవరేజీల్లో ఐఆర్డీఏఐ మార్పులు చేసింది. స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కనీస పరిమితిని రూ.50వేలకు తగ్గించగా, గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.