
జులై నెల వచ్చేసింది. కొత్త నెల రావడంతో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులు, రైల్వే ప్రయాణికులపై కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపుతాయి. అధిక ఖర్చులు, జరిమానాలు, ఇతర ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.

జులై 1వ తేదీ నుంచి పాస్ పోర్ట్ దరఖాస్తు ఫీజులు పెరిగాయి. పాస్ పోర్ట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా కొత్త ధరలు వర్తిస్తాయి. కొత్త ధరల ప్రకారం 36 పేజీల పాస్ పోర్ట్ కోసం రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక తక్షణ సేవ కోసం రూ.5 వేల రుసుం ఉంటుంది.

ఇక కొత్త రైల్వే జరిమానాలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రైల్వేశాఖ నిబంధనలను ఉల్లంఘించేవారికి విధించే జరిమానాలను పెంచింది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసేవారికి గతంలో కనీసం రూ.250 జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు రూ.500కి పెంచారు. ఇక వేరేవారి టికెట్ పై ప్రయాణం చేయడం, జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలో ప్రయాణించడం, నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం, మద్యపానం చేయడం వంటి ఉల్లంఘనలకు రూ.5 వేల వరకు జరిమానా విధిస్తారు.

ఇక రిటైల్ పెట్రోల్ పంపుల్లో డీజిల్ అమ్మకాలపై విధించిన ఆంక్షలను కేంద్రం జులై 1వ తేదీ నుంచి తొలగించనుంది. ఇప్పటివరకు వాణిజ్య వినియోగదారులకు రిటైల్ షాపుల వద్ద డీజిల్ విక్రయాలకు సంబంధించి పరిమితులు విధించారు. అయితే నేటి నుంచి ఎలాంటి పరిమితులు ఉండవు. వాణిజ్య వినియోగదారులు పెట్రోల్ పంపుల వద్ద ఎంత అయినా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు కేంద్రం నిబంధనలను సవరించింది.

ఇక ఆధార్ కార్డుకు లింక్ అయిన ఈమెయిల్ అడ్రస్ ను మార్చుకునేందుకు ఇప్పటివరకు విధిస్తున్న ఫీజును జులై 1 నుంచి యూఐడీఏఐ తొలగించింది. కొత్త ఆధార్ యాప్ ద్వారా మార్చుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇప్పటివరకు ఉన్న రూ.75 రుసుంను మాఫీ చేయనుంది. ఆరు నెలల పాటు ఈ ఉచిత సదుపాయం అమల్లో ఉంటుది. అంటే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది.