
రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్. ఇక నుంచి రైల్వే టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కష్టాలు తప్పనున్నాయి. ఇకపై అత్యంత వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను రైల్వేశాఖ త్వరలో తీసుకురానుంది. దశాబ్దాల నుంచి పాత సిస్టమ్ స్థానంలో కొత్త సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ 1986 నుంచి వాడుకలో ఉంది. పలుమార్లు ఇందులో మార్పులు చేశారు.

అయితే ఇప్పుడు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునేవారు కూడా ఎక్కువైపోయారు. డిమాండ్కు తగ్గట్లు ప్రస్తుత రిజర్వేషన్ సిస్టమ్ లేదు. దీంతో ప్రయాణికులందరూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వెబ్ సైట్ క్రాష్ అవ్వడం, నెమ్మదించడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా కొత్త వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తున్నారు. కొత్త సిస్టమ్లో ఎలాంటి సర్వర్ సమస్యలు ఉండవు. నిమిషాల వ్యవధిలోనే వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లక్షలాది మంది ఒకేసారి బుక్ చేసుకునే సామర్థ్యంతో వ్యవస్థను రూపొందిస్తున్నారు. 2002లో రైల్వేశాఖ ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే విధానం ప్రారంభించింది. అప్పటినుంచి ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునేవారు పెరిగిపోయారు.

ప్రస్తుతం ఎక్కువమంది ఆన్లైన్లోనే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. రైల్వే టికెట్లలో 88 శాతం బుకింగ్స్ కేవలం ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాత వ్యవస్థ స్థానంలో కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు.

ఇటీవల రిజర్వేషన్ వ్యవస్థలో ఏఐ టూల్స్ను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. దీని వల్ల వెయిటింగ్ టికెట్లు కన్పార్మ్ అవుతాయా.. లేదా అనేది ప్రయాణికులు ముందుగానే తెలుసుకోవచ్చు. ఏఐ వ్యవస్థ ఖచ్చితమైన అంచనాతో సమాచారం అందిస్తుంది. గతంలో 53 శాతం ఖచ్చితత్వం ఉండగా.. ఇప్పుడు 94 శాతానికి చేరుకుంది.