
దేశంలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు పెరిగిన కొద్ది దేశంలో ఆస్పత్రుల్లో బెడ్స్తో పాటు ఆక్సిజన్ కొరత ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ పొదుపు కోసం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో వైద్య అవసరాలకు సరిపడ ఆక్సిజన్ అందుబాటులో ఉంచడం కోసం హర్యానాలోని తమ కర్మాగారాలు అన్నింటినీ మూసివేస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే వాస్తవానికి మారుతి సుజుకీ కంపెనీ ప్రతి రెండేళ్లకోసారి మెయింటెనెన్స్ షట్డౌన్ విధిస్తుంటుంది. అయితే జూన్లో మెయింటెనెన్స్ షట్డౌన్ విధించాలని కంపెనీ నిర్ణయించింది. కానీ ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా తమ మెయింటెనెన్స్ షట్డౌన్ మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

తొమ్మిది రోజుల పాటు తన కర్మాగారాల్లో మాన్యుఫాక్చరింగ్ నిలిపివేయడం వల్ల ఆక్సిజన్ వినియోగం ఉండదు. దాని వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరో కరోనా రోగులకు మేలు జరుగుతుందని సంస్థ భావించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

గుజరాత్లోని సుజుకీ మోటార్ కంపెనీ కూడా ఇదే నిర్ణయం తీసుకుందని సంస్థ వెల్లడించింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగుల కోసం కర్మాగారాల్లోని ఆక్సిజన్ను ఆస్పత్రులకు మళ్లించడంతో ప్రభుత్వానికి మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.