
దేశంలో నలుమూలలకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. దీంతో ఎక్కడికైనా సులువుగా, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చు. రైలు ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో ఎక్కువమంది ట్రైన్లో వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు.

అయితే అత్యవసరంగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటుంటారు. ఇక తత్కాల్ టికెట్ కూడా లభించకపోతే జనరల్ కోచుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వుడు టికెట్లను కూడా రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల రైల్వే స్టేషన్లలోని కౌంటర్ల వద్ద క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం అనేది ఉండదు.

అయితే ఆన్లైన్లో కొనుగోలు చేసే అన్ రిజర్వుడ్ టికెట్లకు సంబంధించి రైల్వేశాఖ తాజాగా కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. చాలామంది ఆన్లైన్లో బుక్ చేసిన రైల్వే టికెట్లను వాట్సప్లో భద్రపర్చుకుంటారు. లేదా పీడీఎఫ్ రూపంలో ఫోన్లో ఉంచుకుంటారు. టీటీఈ వచ్చి టికెట్ చూపించమని అడిగినప్పుడు వాట్సప్లోని టికెట్ లేదా పీడీఎఫ్ రూపంలో ఉన్న టికెట్ను చూపిస్తూ ఉంటారు.

ఇక నుంచి అన్ రిజర్వుడు టికెట్లను ఇలా చూపించడం కుదరదు. ఎందుకంటే రైల్వే శాఖ ఇప్పుడు కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇప్పటి నుండి మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాట్సాప్లో వచ్చిన టిక్కెట్ ఫోటో, స్క్రీన్షాట్ లేదా PDF కాపీని టిక్కెట్ కలెక్టర్కు లేదా TTEకి చూపిస్తే కుదరదు. ఇలా చేస్తే మిమ్మల్ని టిక్కెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి భారీగా జరిమానా కూడా విధిస్తారు. ఈ రూల్ రిజర్వేషన్ లేని డిజిటల్ టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది

మీరు టికెట్ ఏ యాప్లో అయినా బుక్ చేశారో ఆ యాప్ ఓపెన్ చేసి టికెట్ వివరాలు టీటీఈ ముందే స్వయంగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని రైలు ప్రయాణం చేసేందుకు అంగీకరిస్తారు. అన్ రిజర్వుడు టికెట్లపై పేరు అనేది ఉండదు. దీంతో ఒకరి టికెట్పై మరొకరు ప్రయాణం చేసే అవకాశముంటుంది. దీంతో రైల్వేశాఖ ఈ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది.