
Honda: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా భారత మార్కెట్లో సరికొత్త సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించడమే కాకుండా సరఫరా వంటి వాటివైపు కూడా దృష్టి సారిస్తోంది. ఇక హోండా ఇండియాలో బ్యాటరీ సర్వీస్ ప్రారంభించింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి వంటి సేవలు అందించనుంది. ఇందు కోసం 'హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా హోండా బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందించనుంది. 2022 జూన్, జూలై నుంచి ఇండియా మార్కెట్లో ఇ-ఆటో రిక్షా కోసం బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందించనుంది. ముందుగా ఈ సేవలు బెంగళూరులో అందుబాటులోకి రానున్నాయి.

హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఈ-బ్యాటరీని కూడా భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తుంది. తమ సర్వీస్ సబ్స్క్రైబర్లు బ్యాటరీని మార్చుకోవడానికి సమీపంలోని బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్ నుంచి సర్వీస్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించిన తర్వాత కొత్త అనుబంధ సంస్థలతో కూడా కంపెనీ భాగస్వామి అవుతుంది. వచ్చే ఐదేళ్లలో పది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని హోండా భావిస్తోంది. 2040 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని లక్ష్యం పెట్టుకుంది.