Hero MotoCorp: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. లాక్డౌన్ తర్వాత దాదాపు అన్ని రంగాలు కూడా ధరలు పెంచేశాయి. దీంతో సామాన్యులపై తీవ్రమైన భారం పడుతోంది. ఇప్పటికే నిత్యావసర ధరల నుంచి పెట్రోల్, డీజిల్, ఇలా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోగా, వాహన రంగాలు కూడా ధరలు పెంచుతూ వినియోగదారుల నడ్డి వరుస్తున్నాయి.
తాజాగా ప్రముఖ టూ-వీలర్ వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ కీలక ప్రటకన చేసింది. ఏప్రిల్ 1, 2021 నుంచి తమ ద్విచక్ర వాహనాలపై రూ.2,500 పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది.ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈ కంపెనీ షేర్లు 0.83శాతం పతనం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్, కాపర్, క్రూడ్ ఆయిల్ పెరగడంతో వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని హీరో మోటోకార్ప్ పేర్కొంది.
అయితే వినియోగదారులపై పూర్తి భారం పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు హీరో సంస్థ తెలిపింది. టూ-వీలర్ తయారీ సంస్థల్లో పేరొందిన హీరో ధరలను పెంచుతూ ప్రకటన చేయడం ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పెంచిన ధరలు అన్ని మోడళ్ల బైక్లకు ఒకేలా ఉండదని, వినియోగదారుడు ఎంచుకునే బైక్ను బట్టి ఉంటుందని, పెంచిన ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని హీరో కంపెనీ చెబుతోంది.
గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతుండటంతో పాటు గత అక్టోబర్ నుంచి ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గడంతో సేల్స్ పడిపోయాయి. దీంతో పాటు వాహనాల తయారీకి సంబంధించిన ముడి పదార్థాల ధరలు పెరగడంతో మోటో కార్ప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచి హీరో స్కూటీలపై కూడా పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ కూడా తమ వాహనాలపై ధరలు పెంచిన విషయం తెలిసిందే.