
ఎవరు అర్హులు.. పేరులోనే ఈ పథకం గురించి అర్థం అవుతుంది. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్.. అంటే వయో వృద్ధులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 60 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా దీనిలో చేరొచ్చు. డిఫెన్స్ ఉద్యోగులు అయితే 50ఏళ్లకు ఖాతా ప్రారంభించొచ్చు.

అధిక వడ్డీ.. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) పోస్టాఫీస్ లో ప్రారంభించొచ్చు. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉంటుంది. దీనిలో అత్యధిక వడ్డీ వస్తోంది. ప్రస్తుతం 8.20శాతం అంటే సుకన్య సమృద్ధి యోజనతో సరిసమానంగా ఉంది. కనీసం రూ. 1000 నుంచి ఎంతైన పెట్టుబడి పెట్టొచ్చు. ఒకరు లేదా జీవిత భాగస్వామితో కలిసి అకౌంట్ ప్రారంభించవచ్చు.

సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్.. ఈ పథకంలో ఒకేసారి డబ్బులను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాల పరిమితి ఐదేళ్లుగా ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసికానికి వడ్డీ జమవుతుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత మరో మూడేళ్లకు దీనిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

నెలకు ఎంత వస్తుంది.. ఈ పథకంలో గరిష్ట పరిమితి గతంలో రూ. 15లక్షలుగా ఉండేది. 2023 బడ్జెట్ సమయంలో దీనిని రూ. 30లక్షలకు పెంచింది. మీరు ఒకేసారి రూ. 30లక్షలు పెట్టుబడి పెడితే ఏటా రూ. 2.46లక్షలు వడ్డీనే లభిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఓసారి రూ. 61,500 చొప్పున మీకు అందిస్తారు.

పన్ను ప్రయోజనాలు.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పాత పన్ను విధానంలో కొంత పన్ను ప్రయోజనం ఈ పథకం ద్వారా లభిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50లక్షల వరకూ పెట్టుబడులపై పన్ను ఆదా అవుతుంది.