దేశంలో సైబర్ క్రైమ్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గంప గుత్తగా ఎక్కువ సిమ్ కార్డులు ఒకేసారి కొనడాన్ని కేంద్రం నిషేధించింది. డిజిటల్ మోసాల నివారణకు సిమ్ కార్డులను విక్రయించే డీలర్లకు ప్రభుత్వం పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. దీంతో సిమ్ డీలర్లు ఇకపై ఇష్టానుసారంగా ఎవరికిపడితే వాళ్లకు సిమ్లను అమ్మలేరన్నమాట.
ఈ మేరకు సిమ్ కార్డ్ విక్రయించే డీలర్లు, కస్టమర్లకు KYC నియమాలను పాటించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం (ఆగస్టు 17) కొత్త రూల్స్ జారీ చేశారు.
దీనిలో భాగంగా ప్రభుత్వం 52 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మే 2023 నుంచి దాదాపు300 ఎఫ్ఐఆర్లు సిమ్ కార్డ్ డీలర్లపై నమోదు చేశారని, 67 వేల మంది డీలర్లు బ్లాక్లిస్ట్లో ఉన్నట్లు తెలిపారు.
ఇకపై కొత్త సిమ్ కార్డ్ కొనే వినియోగదారులందరూ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ వెరిఫికేషన్ సిమ్ కార్డ్ డీలర్లు లేదా సంబంధిత టెలికాం ఆపరేటర్ చేస్తారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.
ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి QR కోడ్ స్కాన్ సిస్టంను తప్పనిసరి చేసింది. సిమ్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఆధార్ e-KYC ప్రక్రియలో థంబ్ ఇంప్రెషన్, ఐరిస్ ఆధారిత ప్రమాణీకరణ, ఫేస్ బెస్ట్ బయోమెట్రిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకోవల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ డిస్కనెక్ట్ అయితే 90 రోజుల గడువు ముగిసే వరకు మరే ఇతర కొత్త కస్టమర్కు కేటాయించకూడదు. పాయింట్ ఆఫ్ సేల్స్-లైసెన్స్దారుల మధ్య వ్రాతపూర్వక ఒప్పందం తప్పనిసరి. ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే మూడేళ్ల జైలు శిక్షతోపాటు బ్లాక్ లిస్ట్లో చేర్చుతారు. ప్రస్తుతం ఉన్న అన్ని పీఓఎస్లను 12 నెలల్లోగా నమోదు చేసుకోవాలి.