
గణేశ్ చతుర్ది పండుగ సీజన్ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్ అందించింది. పండుగ సందర్భంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టగా.. రద్దీకి అనుగుణంగా మరికొన్ని రైలు సర్వీసులను నడుపుతోంది. అందులో భాగంగా తాజాగా మరో ప్రత్యేక రైలు ప్రకటించింది.

పండుగ సీజన్ క్రమంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్-వట్వా-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇందుకోసం సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు ఏ తేదీన అందుబాటులో ఉంటుందనే వివరాలతో పాటు టైమింగ్స్, ఆగే స్టేషన్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవాలని సూచించింది.

హైదరాబాద్-వట్వా(07087) రైలు 19వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆ రోజున హైదరాబాద్లో 20.15 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు 21.50 గంటలకు వట్వా చేరుకుంటుంది. ఇక వట్వా-హైదరాబాద్(07088) ట్రైన్ 21వ తేదీన 03.30 గంటలకు వట్వా స్టేషన్ నుంచి బయల్దేరి.. తర్వాతి రోజు 04.30 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది.

హైదరాబాద్ నుంచి వట్వా వెళ్లే రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కల్ బుర్గి, సోలాపూర్, పుణె, కల్యాణ్, వాసాయి రోడ్, సూరత్, వడోదర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇక వట్వా-హైదరాబాద్ ప్రత్యేక ట్రైన్ వడోదర, సూరత్, వాసాయి రోడ్, కల్యాణ్, లోనవాలా, పుణె, సోలాపూర్, కల్బుర్గి, వాడి, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ సెకండ్ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగ సీజన్ ఇంటికెళ్లేవారు, ఇంటి నుంచి తిరిగి వచ్చేవారు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనంగా ఈ స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.