
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్. కేంద్రం కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ప్రకటన చేశారు. ఈపీఎఫ్వో సేవలు వేగంగా అందించేందుకు ఒక సెంట్రలైజ్డ్ ఐటీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని వల్ల అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ కార్యాలయాల్లోని సభ్యుల రికార్డులన్నీ సైంట్రలైజ్డ్ జాతీయ డేటాబేస్లోకి తీసుకువచ్చారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పీఎఫ్ క్లెయిమ్స్, వడ్డీ జమ వేగంగా ప్రాసెస్ అవుతాయి.

2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం చొప్పున ఈపీఎఫ్ఓ వడ్డీని జమ చేస్తోంది. జూలై 15వ తేదీ నాటికి 34 కోట్ల మంది ఖాతాదారులకు అందించనున్నారు. తొలిసారిగా ఆటో ప్రాసెస్ విధానంలో వడ్డీ జమ చేస్తున్నారు. ఇక రూ.5 లక్షల్లోపు క్లెయిమ్స్ను పేపర్ లెస్ విధానంలో ఆటో సెటిల్మెంట్ చేయనున్నారు. సెటిల్మెంట్ జరిగిన రోజే సభ్యుని బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది. మూడు రోజుల్లో క్లెయిమ్స్ సెటిల్ అవుతుంది.

ఇక కొత్త ఐటీ వ్యవస్థ ద్వారా మరో పెద్ద మార్పు కూడా అమల్లోకి తెచ్చారు. ఈపీఎస్ పెన్షనర్లు ఇక నుంచి ఏ పీఎఫ్ కార్యాలయం నుంచైనా సేవలు పొందవచ్చు. అలాగే లైఫ్ సర్టిఫికేట్లను ఏ కార్యాలయం నుంచి అయినా సమర్పించవచ్చు. దేశంలో ఎక్కడైనా తమ బ్యాంకు ఖాతా ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఇంతకుముందు తమ పీఎఫ్ అకౌంట్ పరిధిలోని బ్రాంచ్ కార్యాలయం నుండి తమ పెన్షన్ను అందుకునేవారు. ఇప్పుడు దేశంలో ఎక్కడినుంచైనా పొందవచ్చు

ఇక తుది పీఎఫ్ సెటిల్మెంట్లో ఇప్పుడు చెల్లింపు ఆమోదం తేదీ వరకు వడ్డీని లెక్కిస్తారు. ఇంతకుముందు వడ్డీని కేవలం గత నెల చివరి రోజు వరకు మాత్రమే లెక్కించేవారు. కానీ ఇప్పుడు రూల్స్ మార్చారు. ఇక నుంచి ఉద్యోగాలు మారినప్పుడు ఆధార్తో లింక్ అయిన UANలు ఉన్న PF ఖాతాలు ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి బదిలీ అవుతాయి. పెన్షన్ అర్హత కోసంసర్వీస్ హిస్టరీ కూడా ఆటోమేటిక్గా బదిలీ చేయబడుతుంది. గతంలో ఇందుకోసం పీఎఫ్ ఖాతాదారులు రిక్వెస్ట్ పెట్టాల్సి వచ్చేది. అలాగే పీఎఫ్ కార్యాలయం నుండి ఆమోదం అవసరమయ్యేది.

ఇప్పుడు ఎలాంటి క్లెయిమ్ దాఖలు చేయకుండానే ఆటోమేటిక్గా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అవుతాయి. ఇక ఇప్పటినుంచి క్లెయిమ్లు దాఖలు చేసేటప్పుడు సభ్యులకు వారి విత్డ్రాయల్ పరిమితి గురించి సమాచారం తెలియచేస్తుంది. దీని ద్వారా క్లెయిమ్స్ తిరస్కరణలు అనేవి తగ్గనున్నాయి. అలాగే విత్ డ్రాయల్స్కు సంబంధించి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు.