
మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. త్వరలో చికెన్, కోడి గుడ్ల ధరలు పెరగనున్నాయి. ఆల్ ఇండియా పాల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కోళ్ల మేత ధరలు విపరీతంగా పెరగడంతో పాటు రానుున్న నెలల్లో పండుగల సీజన్ వస్తున్న క్రమంలో దేశంలో కోళ్ల ఉత్పత్తిని భారీగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 25 శాతం మేర ఉత్పత్తిని తగ్గించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బహదూర్ అలీ ప్రకటించారు.

ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. కోళ్ల దాణాతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కోళ్లకు సోయాబీన్ మీల్ దాణాగా వేస్తుంటారు. ఇటీవల వీటి ధరలు పెరిగాయి. ఒక్క నెలలోనే వీటి ధర 40 శాతానికిపైగా పెరిగింది. దీని వల్ల కోళ్ల పెంపకందారులకు నిర్వహణ ఖర్చులు పెరగ్గా.. లాభాలు కూడా తగ్గిపోయాయి.

ఈ క్రమంలో పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు కోళ్ల ఉత్పత్తిని తగ్గించాలని పాల్ట్రీ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా జులై నుంచి అక్టోబర్ వరకు అనేక పండుగలు వస్తున్నాయి. శ్రావణ మాసం, నవరాత్రి లాంటివి రానున్నాయి. ఈ సమయంలో నాన్ వెజ్ విక్రయాలు సాధారణంగా తగ్గడం వల్ల మాంసానికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండదు. దీంతో ఉత్పత్తిని తగ్గించాలని పాల్ట్రీ పరిశ్రమ నిర్ణయించింది.

కోళ్ల ఉత్పత్తిని తగ్గించడం వల్ల చికెన్, కోడి గుడ్ల ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఉత్పత్తిని తగ్గించే చర్యలో భాగంగా పెంపకందారులు పిల్లలను ఉత్పత్తి చేసే తల్లి కోళ్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారు. దీంతో కోడి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గతంలో బ్రీడర్ కోడి ఒక్కొకటి రూ.140కి అమ్ముడుపోయేది. కానీ ఇప్పుడు రూ.65 పలుకుతోంది.

అయితే దాణా ఖర్చులకు సంబంధించి సోయాబీన్ మీల్ దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పాల్ట్రీ పరిశ్రమలు కోరుతున్నాయి. కొంతమంది దేశంలో కావాలని కృతిమ కొరత సృష్టిస్తు్న్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తమ వ్యాపారాన్ని వృద్ది చేసేందుకు కొంతమంది కలిసి కృతిమ కొరత సృష్టిస్తు్న్నారని చెబుతున్నారు. ప్రభుత్వంపై వీరిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం చికెన్ ధరలు ప్రాంతాన్ని బట్టి రూ.250 నుంచి రూ.300 మధ్య పలుకుతున్నాయి.