
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంనాడు(20 సెప్టెంబర్) భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 84 వేల పాయింట్లకు ఎగువున ముగిసింది. 1359 పాయింట్ల లాభం(1.7 శాతం)తో సెన్సెక్స్ 84,544.31 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. ఓ దశలో సెన్సెక్స్ 84,694 పాయింట్ల ఆల్ టైమ్ హై స్థాయిని తాకింది. బీఎస్ఈలోని 250కి పైగా స్టాక్స్ గత 54 వారాల (సంవత్సరం) గరిష్ఠ స్థాయికి చేరాయి.

అటు నిఫ్టీ కూడా 375 పాయింట్ల లాభం(1.5 శాతం)తో 25,790.95 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. అంతకు ముందు నిఫ్టీ ఓ దశలో ఆల్ టైమ్ హై స్థాయి 25,849 పాయింట్లను తాకింది. ఉదయం నుంచి క్లోజింగ్ వరకు సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియాల్టీ, ఎనర్జీ, మెటల్ తదితర రంగాలకు చెందిన షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 30లో నాలుగు స్టాక్స్ ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

ఫలితంగా మదుపర్ల సంపద శుక్రవారం ఒక్క రోజే ఏకంగా రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. స్టాక్ మార్కెట్లో గురువారంనాడు రూ.466 లక్షల కోట్లుగా ఉన్న మదుపర్ల సంపద.. శుక్రవారంనాడు రూ.472 లక్షల కోట్లకు చేరింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొంది. దీని సానుకూల ప్రభావం భారత్ సహా ఆసియా స్టాక్ మార్కెట్లలోనూ కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.