మార్కెట్లో కొత్త కొత్త స్కూటర్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్ను ఉపయోగించి మార్కెట్లోకి వదులుతున్నాయి కంపెనీలు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్ను విడుదల చేసింది బగాస్ ఆటో లిమిటెడ్. తన ఫ్లాగ్షిప్ ఈవీ మాడల్ ‘సీ12’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు నచ్చే విధంగా స్కూటర్ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.
విడుదల సందర్భంగా ఈ స్కూటర్ ధరను రూ.97,999గా నిర్ణయించింది. రెగ్యులర్ ధర రూ.1,04,999. ముందస్తుగా రూ.999 చెల్లించి ఈ స్కూటర్ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
పుణెలో ఉన్న ఆర్అండ్డీ లోనే తయారైన ఈ స్కూటర్ దేశీయ విడిభాగాలతో తీర్చిదిద్దినట్టు కంపెనీ ఫౌండర్, ఎండీ హేమంత్ కాబ్రా చెప్పారు.
ఒక్కసారి బ్యాటరీ రీచార్జితో 143 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా 100 షోరూంలు ఉన్నాయి.