
Cheque Clearing RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ విధానంలో కీలక మార్పులు తీసుకువస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిబంధనలలో మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా ఏదైనా చెక్ క్లియరెన్స్ కావాలంటే రెండు, మూడు రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ కానుంది. శనివారం నుండి భారతదేశంలో చెక్కు క్లియరింగ్ వ్యవస్థ చాలా వేగంగా మారుతుంది. బ్యాచ్-ఆధారిత ప్రక్రియ నుండి నిరంతర క్లియరింగ్, రియలైజేషన్ తర్వాత సెటిల్మెంట్కు మారుతుంది. అంటే చెక్కుల నుండి నిధులు సాధారణ ఒకటి నుండి రెండు పని దినాలకు బదులుగా కొన్ని గంటల్లోనే మీ బ్యాంక్ ఖాతాకు చేరుతాయి.

అక్టోబర్ 4న అధికారికంగా అమలులోకి రాకముందే శుక్రవారం కొత్త చెక్ క్లియరెన్స్ సిస్టమ్ ట్రయల్ రన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షెడ్యూల్ చేసింది. కొత్త విధానం ప్రకారం, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒకే ప్రెజెంటేషన్ సెషన్లో బ్యాంకు శాఖలలో జమ చేసిన అన్ని చెక్కులను స్కాన్ చేసి, ముగింపు రోజు కోసం వేచి ఉండటానికి బదులుగా, తక్షణమే సెంట్రల్ క్లియరింగ్ హౌస్కు పంపుతారు. క్లియరింగ్ హౌస్, "చెక్ ఇమేజ్లను నిరంతర ప్రాతిపదికన డ్రాయీ బ్యాంకులకు విడుదల చేస్తుంది. డ్రాయీ బ్యాంకుకు చెక్ ఇమేజ్ వచ్చిన తర్వాత చెక్ క్లియర్ అవుతుందా లేదా అని నిర్ధారించడానికి సాయంత్రం 7 గంటల వరకు సమయం ఉంటుంది.

చెక్ల భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ పాజిటివ్ పే సిస్టమ్ను తప్పనిసరి చేసింది. ఈ విధానంలో రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్ల కోసం కస్టమర్లు ముందుగానే కొన్ని వివరాలు బ్యాంకుకు సమర్పించాలి. వాటిలో అకౌంట్ నంబర్, చెక్ నంబర్, చెక్ తేదీ, చెక్ మొత్తం లబ్ధిదారుడి పేరు తెలియజేయాలి. ఈ వివరాలను చెక్ డిపాజిట్ చేయడానికి కనీసం 24 పని గంటల ముందు బ్యాంకుకు ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.

బ్యాంక్ వాటిని ధృవీకరించిన తర్వాత చెక్ వివరాలు సరిపోలితే క్లియర్ అవుతుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే చెక్ తిరస్కరించబడుతుంది. మీరు మళ్లీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రూ.5లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్లకు పాజిటివ్ పే సిస్టమ్ తప్పనిసరి. అయితే రూ.50,000 పైన ఉన్న చెక్లకు దీనిని ఉపయోగించమని బ్యాంకులు సిఫార్సు చేస్తున్నాయి.

ఆర్బీఐ ఈ కొత్త విధానాన్ని రెండు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుంచి మొదలవుతుంది. రెండో దశ జనవరి 3, 2026 నుంచి అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం చెక్ క్లియరెన్స్ను వేగవంతం చేయడమే కాకుండా మీ లావాదేవీలను మరింత సురక్షితం చేస్తుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను జాగ్రత్తగా నింపడం, పాజిటివ్ పే సిస్టమ్ను ఉపయోగించడం ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు.