Vehicle Renewal: 15 సంవత్సరాల పైబడిన పాత వాహనాల ఆర్సీ రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి 15 ఏళ్లు పైబడిన వాహనాల ఆర్సీ రెన్యువల్కు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాదు ఆర్సీ రెన్యువల్ ఆలస్యం చేసేవారిపై కూడా చర్యలు తీసుకోనుంది. భారీగా జరిమానా విధించనుంది. ఇకపై ప్రైవేటు వాహనాల రిజస్ట్రేషన్ రెన్యువల్ లో ఏమైనా ఆలస్యంగా జరిగినట్లయితే నెలకు రూ. 300 నుంచి రూ.500 వరకు జరిమానా విధించనుంది.
ఒక వేళ వాణిజ్య, వాహనాలకు ఫిట్నెష్ సర్టిఫికేట్ రెన్యువల్ ఆలస్యం చేసినట్లయితే వారికి రోజువారీగా రూ.50 జరిమానా పడనుంది. అదే విధంగా పదిహేనేళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ.1000 వరకు పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ కోసం రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే దాదాపు 21 రేట్లు ఎక్కువ అనే చెప్పాలి. అయితే 2021 అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అందుబాటులోకి రానుంది. వాహన స్క్రాపేజ్విధానాన్ని రూపొందించే ప్రణాళికలో భాగంగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ పెంపును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా 15 ఏళ్లు దాటిన ప్రైవేటు వాహనాల విషయంలో వాటి యజమానులు ప్రతి ఐదేళ్ల కోసారి ఆర్సీ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వాణిజ్య వాహనాల విషయంలో అవి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ తప్పనిసరి. ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయిన తర్వాతే ఆ వాహనానికి రెన్యువల్ సర్టిఫికేట్ అందజేస్తారు. అయితే వాహనాలను స్క్రాప్ చేయడానికి, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసింది.
ఈ ప్రతిపాదనల ప్రకారం వాహన యజమాని దేశంలోని ఏ స్క్రాపింగ్ కేంద్రానికైనా తన పాత వాహనాన్ని తీసుకెళ్లి ఉచిత సర్వీసులు పొందవచ్చు. ఆ యజమాని తన స్క్రాపింగ్సర్టిఫికేట్ను ఎవరికైనా బదిలీ చేసి కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. దీని కోసం ప్రోత్సాహాలను కూడా పొందవచ్చు.