
కోస్టల్ సిటీ విశాఖలో ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 10 గంటలకే నగరంలోని అనేక రోడ్లపై వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మధ్యాహ్నం అనేక ప్రాంతాల్లో వడగాలులు వీస్తుండటంతో కొన్నిచోట్ల రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆర్కే బీచ్, రైల్వే స్టేషన్ వంటి బిజీ రోడ్లలో.. తప్పనిసరి పరిస్థితుల్లో జనం రోడ్లపైకి రావాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఆపసోపాలు పడక తప్పడం లేదు.

ఆదివారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ రూరల్, మహారాణిపేటలో 45.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు నగర పరిధిలోని అనేక ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఆర్కే బీచ్కు తరలివచ్చారు. సముద్రంలో స్నానాలు చేస్తూ ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు.

అయితే.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వాహనదారులు, పర్యాటకులకు ఉపశమనం కలిగించేలా విశాఖ పోర్ట్ చర్యలు చేపట్టింది. వేసవి తీవ్రత నేపథ్యంలో రోడ్లపై ఫాగింగ్ - మిస్ట్ కానన్లతో స్ప్రింక్లింగ్ చేస్తోంది. ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్లలో ప్రత్యేక వాహనంతో నీటిని వెదజల్లేలా చర్యలు చేపట్టింది పోర్ట్ యాజమాన్యం. ప్రతిరోజూ పరిమిత సమయంలో రోడ్లపై స్ప్రింక్లింగ్ చేయిస్తోంది.

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్ పరిధి, రైల్వే స్టేషన్ రోడ్డులో వాటర్ ఫాగింగ్ - మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా నిరంతరం ఆయా ప్రాంతాల్లో నీటిని సన్నని జల్లుల రూపంలో వెదజల్లడం వల్ల కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్కే బీచ్ నుంచి అప్పుఘర్ ప్రాంతం వరకు, అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. దీని ద్వారా తీవ్ర వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.

బీచ్ రోడ్డుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, సందర్శకులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రస్తుత ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మిస్ట్ కానన్ను ఏర్పాటు చేయడం ద్వారా పరిసర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేసినట్లు పోర్ట్ యాజమాన్యం తెలిపింది.