
బిల్వపత్రాలలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B1, విటమిన్ B6 వంటి ముఖ్యమైన విటమిన్లతో పాటు కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి డయాబెటిస్, పైల్స్, గుండె సమస్యలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో సహాయపడతాయి. ఈ ఆకులను సరిగ్గా వినియోగించుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

బిల్వపత్రాలలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను బలపరిచే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తహీనత సమస్యలు ఉన్నవారికి బిల్వపత్ర జ్యూస్ ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది.. ప్రతిరోజూ ఒక చెంచా బిల్వపత్ర రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల అనీమియా సమస్యను నివారించుకోవచ్చు.

బిల్వపత్రాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులను తగ్గించే శక్తి ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు తగ్గించేందుకు బిల్వపత్రాలను తరచుగా నమలడం మంచి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. పైల్స్ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో బిల్వపత్రాలను నమలడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. తరచూ వీటిని తీసుకోవటం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

తరచూ బిల్వపత్రాలతో చేసిన రసం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బిల్వపత్రాలను నమలడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చు. బిల్వపత్రాలలో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండటం వల్ల మధుమేహ రోగులకు ఇవి చాలా మంచివి.

ప్రతిరోజూ ఈ ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. అనేక ఔషధ గుణాలు నిండివున్న బిల్వపత్రాలను నేరుగా నమిలి తినవచ్చు. లేదంటే, నీటిలో మరిగించి ఆ నీటిని తాగొచ్చు. అయితే, దీన్ని సేవించే ముందు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.