
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పొడి కలుపుకుని తిన్నా, లేదా ఇడ్లీ, దోశలపై చల్లుకుని తిన్నా అమృతతుల్యంగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే గాలి తగలకుండా డబ్బాలో ఉంచితే నెల రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.

ఈ వెల్లుల్లి పప్పుల పొడి తయారీకి ముందుగా 100 గ్రాముల వెల్లుల్లి రేకలను పొట్టు పొట్టుగానే కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో 150 గ్రాముల పుట్నాల పప్పు వేసి వేపాల్సిన అవసరం లేకుండా సన్నటి మంటపై కేవలం వెచ్చబడే వరకు వేయించి పక్కన తీసుకోవాలి.

అదే మూకుడులో 3-4 బ్యాడిగి మిర్చి , 12-15 కారంగా ఉండే ఎండుమిరపకాయలు వేసి సన్నటి మంటపై వేయించాలి. మిర్చి వేగుతుండగా టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా రాళ్ల ఉప్పు వేసి ఒక నిమిషం వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు పాన్లో 6-8 చెంచాల నూనె వేడిచేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు (వేరుశనగ గుళ్లు) వేసి ఎర్రగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి.

మిగిలిన నూనెలో దంచిన వెల్లుల్లి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి.మిక్సీ జార్లో పల్లీలు, వేయించిన ఎండుమిర్చి మిశ్రమం, నిమ్మకాయంత చింతపండు, మరియు పుట్నాల పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత వేయించి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఒకటి రెండు సార్లు మాత్రమే పల్స్ చేయాలి. వెల్లుల్లి పలుకులుగా ఉంటేనే పొడి తింటుంటే పంటి కింద పడి ఎంతో రుచిగా ఉంటుంది. తయారైన ఈ పొడిని ఎయిర్ టైట్ జార్లో భద్రపరిస్తే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.