అరకు కాఫీకి మరో అవార్డు లభించింది. ఒక జిల్లా, ఉత్పత్తి లో జాతీయ స్థాయి ప్రధమ స్థానం అవార్డును సొంతం చేసుకుంది అరకు కాఫీ. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రుల చేతుల మీద అవార్డు స్వీకరించారు జిసిసి వైస్ చైర్మన్ ఎం.డి. సురేష్ కుమార్.
గిరిజన సహకార సంస్థ సారధ్యంలో అరకు కాఫీ.. జాతీయ స్థాయి ఒక జిల్లా, ఒక ఉత్పత్తి ( One District One Product- ODOP)2023అవార్డుకు ప్రధమ స్థానంలో నిలిచింది. అవార్డును సొంతం చేసుకుంది. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వేడుకలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు జిసిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో అరకు కాఫీకి విశిష్ట గుర్తింపు ఇచ్చిన అధికారులకు, అల్లూరి జిల్లాలోని అరకు, చింతపల్లి ప్రాంతాల గిరిజన కాఫీ రైతులకు కృతజ్ఞతలు తెలియజేసారు ఎం డీ. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ తీసుకురావడంలో సహకరిస్తున్న గిరిజన రైతులు, జిసిసి సిబ్బంది సహకారం, కృషి అభినందనీయమని అన్నారు.
దేశ విదేశాల్లో అరకు కాఫీకి ఆదరణ: ఏజెన్సీ ప్రాంతీ గిరిజన కాఫీ రైతుల అభ్యున్నతి కోసం తాము చేస్తున్న కృషికి తాము ఎంతో గర్విస్తున్నామని అని అన్నారు జిసిసి ఎం.డి సురేష్ కుమార్. 2022 -23 కాఫీ సీజనులో సుమారు వెయ్యి టన్నుల అరబిక పాచ్ మెంట్, అరబిక చెరీ రకం కాఫీ గింజలను కొనుగోలు చేసి గిరిజన కాఫీ రైతులకు 20.07 కోట్ల రూపాయలను చెల్లించామని అన్నారు. ప్రస్తుతం జిసిసి సేకరించిన కాఫీ గింజలతో బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్న అరకు వ్యాలీ కాఫీ ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు.
అరబికా హాట్ కాఫీ అవుట్లెట్లకు విశేష ఆదరణ: విశాఖ, హైదరాబాద్ నగరాలతో పాటు, పలు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో జిసిసి అరబికా హాట్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కాఫీ ఔట్ లెట్లకు పర్యాటకులు, వినియోగదార్ల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందని అన్నారు జిసిసి ఎండీ. ఈ ఏడాది సీజన్లో పాడేరు, చింతపల్లి, రంప చోడవరం డివిజన్లలోని 9 సొసైటీల పరిధిలో 1500 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
గిరిజనులు పండించే కాఫీ గింజలు సేకరించడం, విక్రయించడంలో జిసిసి గత కొన్నేళ్లుగా మంఛి ఫలితాలను సాధిస్తోందని చెప్పారు. గత ఏడాది ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్న కాఫీ రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పించేందుకు జిసిసి సహకరిస్తుందని, ఇప్పటి వరకూ 3900 రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేయించామన్నారు.
కాఫీ రైతులకు రుణ సహాయం అందించడంతో పాటు, ధరలు ఆశాజనకంగా ఇస్తుండడం, రైతుల ఖాతాకు 24 గంటల్లో సొమ్ము జమ చేస్తుండడంతో గిరిజన రైతులు జిసిసికే విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు.
నాలుగు కోట్లతో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్: గిరిజనుల నుంచి సేకరిస్తున్న కాఫీ గింజల నుంచి కాఫీ పౌడర్ ను తయారు చేసేందుకు కొయ్యూరు మండలం డౌనూరులో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రిటేడ్ కాఫీ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు జిసిసి ఎండి సురేష్ కుమార్ చెప్పారు. జిసిసికి కాఫీ గింజలను విక్రయిస్తూ గిరిజన కాఫీ రైతులు ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్నారని, జాతీయ అవార్డు స్ఫూర్తితో అరకు కాఫీకి మరింత ఆదరణ లభిస్తుందని జిసిసి ఎం.డి. సురేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.