
పూణె, జులై 16: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాకు చెందిన నిండు గర్భిణీ రితికా ధేరే (19), ఆమె భర్త అల్తాఫ్షేక్తో కలిసి పుణె నుంచి పర్భానీకి స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తుంది. సంత్ ప్రయాగ్ ట్రావెల్స్ బస్సులో స్లీపర్ కోచ్లో ఈ జంట ప్రయాణిస్తోంది. అయితే మార్గం మధ్యలో బస్సులోనే రితికాకు ప్రసవ నొప్పులు వచ్చాయి. అక్కడే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆనక ఆ బిడ్డను ఓ గుడ్డలో చుట్టి బస్సు కిటికీలో నుంచి రోడ్డుపై విసిరేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పత్రి-సేలు రోడ్డు మార్గంలో జరిగింది. బస్సు కిటికీలో నుంచి గుడ్డతో చుట్టబడిన ఏదో వస్తువు విసిరివేయబడటాన్ని గమనించిన ఓ ప్రయాణీకుడు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వాహనం నుండి ఏదో పడవేయబడటం చూసిన బస్సు డ్రైవర్.. బస్సును రోడ్డుపక్కన ఆపి ఆ జంటను ప్రశ్నించాడు. తన భార్య మోషన్ సిక్నెస్ కారణంగా వాంతులు చేసుకుందని డ్రైవర్ కు అల్తాఫ్షేక్ చెప్పాడు. ఇంతలో రోడ్డుపై గుడ్డలో రక్తం మడుగులో పడిఉన్న నవజాత శిశువును చూసిన కొందరు స్థానికులు వెంటనే 112 అత్యవసర హెల్ప్లైన్తో పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే రోడ్డుపై పడేయడంతో శిశువు తీవ్రంగా గాయపడి మరణించింది. సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు బస్సును అడ్డగించి రితికా, అల్తాఫ్షేక్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బిడ్డను పెంచలేకనే వదిలించుకోవడానికి కిటికీలో నుంచి రోడ్డుపైకి విసిరేసినట్లు ఆ జంట నేరం అంగీకరించారు.
రితికా, అల్తాఫ్షేక్ ఇద్దరూ పర్భానీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరు గత ఏడాదిన్నర కాలంగా పూణేలో నివసిస్తున్నారు. వీరికి వివాహం జరిగినట్లు చెప్పుకున్నప్పటికీ, వారి సంబంధాన్ని నిర్ధారించడానికి వారి వద్ద ఎటువంటి పత్రాలు లభ్యంకాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు.. రితికాను వైద్య సంరక్షణ కోసం ఆస్పత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.