ఉల్లి ధర చూస్తే గుండె గుభేల్.. అసలు రీజన్ ఏంటంటే..?

| Edited By:

Nov 08, 2019 | 4:27 PM

దేశ వ్యాప్తంగా ఉల్లి ఘాటెక్కింది. రుచిలో కాదండోయ్.. ధరలో.. అవును గతకొద్ది నెలలుగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయ్. సాధారణంగా రూ.10 కిలో పలికే దీని ధర.. గత ఆగస్ట్ నుంచి.. క్రమ క్రమంగా.. రూ. 50కి చేరుకుంది. ఆ తర్వాత ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కి పైగా పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రూ.70 నుంచి 90 మధ్య పలుకుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి […]

ఉల్లి ధర చూస్తే గుండె గుభేల్.. అసలు రీజన్ ఏంటంటే..?
Follow us on

దేశ వ్యాప్తంగా ఉల్లి ఘాటెక్కింది. రుచిలో కాదండోయ్.. ధరలో.. అవును గతకొద్ది నెలలుగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయ్. సాధారణంగా రూ.10 కిలో పలికే దీని ధర.. గత ఆగస్ట్ నుంచి.. క్రమ క్రమంగా.. రూ. 50కి చేరుకుంది. ఆ తర్వాత ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కి పైగా పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రూ.70 నుంచి 90 మధ్య పలుకుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి కొండెక్కి కూర్చొంది. మొన్నటి వరకు రూ.50 ఉన్న ధర.. ప్రస్తుతం రూ.70 నుంచి 80 వరకు పలుకుతుంది. అయితే దీనికి కారణం.. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కురిసిన భారీ వర్షాల కారణంగా.. ఉల్లి సాగుకు అంతరాయం కల్గిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చేతికందిన పంట పలుచోట్ల నీటమునగడంతో.. ఉల్లికి డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఉల్లి ధరకు ఉపశమనం కోసం ప్రయత్నాలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేసి.. సబ్సిడీతో అమ్మకాలు చేపడుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంది. విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.

ఉల్లి ధర వెనుక అసలు నిజమేంటంటే..

ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో ఉల్లి ధర సెంచరీకి చేరడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. అసలు రీజన్ ఎంటన్న దానిపై ఆరా తీయడంతో.. సంచలన విషయాలు బయటపడ్డాయి. మార్కెట్లో దళారులు.. ఉల్లికి కృత్రిమ కొరత సృష్టించి ధర పెంచుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి సాగుకు బ్రేకులు పడ్డ విషయం నిజమే అయినా.. కేంద్రం విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో దేశంలో ఉల్లి కొరత తగ్గుతుందని భావించింది. కానీ సీన్ రివర్స్ అవ్వడంతో.. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగడంతో.. అసలు నిజాలు బయటపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజిలెన్స్ అధికారులు పలుచోట్ల దాడులు చేపట్టారు. ఏపీలో ఏకకాలంలో డెబ్బై ఉల్లి వ్యాపార కేంద్రాలపై దాడులు చేయగా.. 47 చోట్ల అక్రమ నిల్వాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 10చోట్ల రూ.27 లక్షలకు పైగా విలువైన 603 క్వింటాళ్ల ఉల్లిని అక్రమంగా నిల్వ చేసినట్టు గుర్తించారు. ఈ విధంగా వ్యాపారులు మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి.. ఉల్లి ధరలను అమాంతం పెంచుతున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తూ.. ఉల్లిని కొండెక్కి కూర్చోపెడుతున్నారు దళారులు. మరి ఈ దోపిడీకి అన్ని చోట్ల ప్రభుత్వాలు చెక్ పెట్టి.. ఉల్లి ధరను అదుపులోకి తీసుకొస్తారో.. లేదో చూడాల్సిందే.