
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ షార్టేజ్ సంగతేమోగానీ.. అన్ని సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో తెగ కొనేస్తున్నారు జనం. నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసర సామానును ముందస్తుగా కొని నిల్వ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లకు జనం బారులు తీరుతున్నారు. ఈ భయం కారణంగా.. ధరలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి దేశంలో ఆహారం, ఎరువులు, ఇంధన నిల్వలు అన్నీ పుష్కలంగానే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేస్తోంది. అనవసర భయాలు వద్దంటోంది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. భారత ప్రభుత్వం వద్ద అటువంటి ఎలాంటి ప్రతిపాదనా పరిశీలనలో లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న ఈ వదంతులు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే బాధ్యతారహితమైన ప్రయత్నాలని ఆయన హెచ్చరించారు.
పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యమన్నారు. వదంతులు వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించడం బాధ్యతారహితమైన చర్యగా పేర్కొన్నారు. ఇంధన సరఫరా, నిత్యావసర వస్తువుల రంగాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా ప్రజలకు ఇంధనం, విద్యుత్, ఇతర కీలక సరఫరాలు నిరంతరాయంగా అందేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం హామీ ఇచ్చింది. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో భారతదేశం నిరంతరం తన దృఢత్వాన్ని ప్రదర్శించిందని, సమయానుకూలంగా, సకాలంలో సమన్వయంతో వ్యవహరిస్తామని తెలిపింది. పశ్చిమాసియా సంఘర్షణ కారణంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో ఏర్పడిన సవాళ్ల మధ్య కూడా భారతదేశంలో క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తదితర ఇంధనాల సరఫరా పూర్తిగా సురక్షితంగా ఉందని కేంద్రం ఇదివరకే పార్లమెంటులోనూ స్పష్టం చేసింది. రిఫైనరీలు అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..