Viral Video: దారుణం.. చిత్తు కాగితాల్లో సర్కార్‌ బడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం! వీడియో

గణతంత్ర దినోత్సవం నాడు ఓ పాఠశాలలోని విద్యార్ధులకు అధికారులు చిత్తు కాగితాల్లో మధ్యాహ్నం భోజనం అందించారు. నేలపై కూర్చోబెట్టి.. చిత్తు కాగితాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Viral Video: దారుణం.. చిత్తు కాగితాల్లో సర్కార్‌ బడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం! వీడియో
Midday Meal On Waste Paper Scraps At Govt School

Updated on: Jan 28, 2026 | 11:34 AM

భోపాల్, జనవరి 28: రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఓ పాఠశాల బడి పిల్లలకు అధికారులు చిత్తు కాగితాల్లో మధ్యాహ్నం భోజనం అందించారు. నేలపై కూర్చోబెట్టి.. చిత్తు కాగితాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాల్లో జనవరి 26న గణతంత్ర దినోత్సవ విందు సందర్భంగా చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లో మైహార్ జిల్లాలో జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు పూరీ, హల్వాను మధ్యాహ్న భోజనంలో భాగంగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే పిల్లలకు ప్లేట్లకు బదులుగా చిత్తు కాగితాల ముక్కలు, పాఠ్యా పుస్తకాల నుంచి చింపిన పేపర్లను అందించి.. వాటిల్లో ప్రత్యేక మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటన మహిర్‌ జిల్లా భాటిగ్వన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. దీనిపై అనేక వర్గాల నుంచి విమర్శలు రావడంతో జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది.

ఇవి కూడా చదవండి

జిల్లా ప్రాజెక్టు సమన్వయకర్త విష్ణు త్రిపాఠి ఈ సంఘటనపై దర్యాప్తు నిర్వహించి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దర్యాప్తు నివేదిక ఆధారంగా పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ త్రిపాఠిని జిల్లా కలెక్టర్ కమిషనర్ రేవా సస్పెండ్‌ చేశారు. అంతేకాకుండా స్థానిక బ్లాక్ రిసోర్స్ కోఆర్డినేటర్ జనవరి నెల జీతం తొలగించారు. జిల్లా పంచాయతీలో మధ్యాహ్న భోజన పథకం బాధ్యత వహించే అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. పాఠశాలల్లో పిల్లల పరిశుభ్రత, గౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా చూసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా లోపం తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఇది విద్యార్థులను మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థను కూడా అవమానించడమేనని అభివర్ణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.