
సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వినూత్న చర్య చేపట్టారు. సోమవారం (జూన్ 15) తన స్వగ్రామ ప్రాంతమైన నాగ్లా తరైలోని ప్రైవేట్ నివాసం వద్ద స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం పొలంలో ఆవు పేడతో తయారుచేసిన సహజ ఎరువును చల్లి సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లి బిష్ణా దేవి కూడా పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధామి మాట్లాడుతూ, వ్యవసాయం కేవలం జీవనోపాధి సాధనం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే సాంప్రదాయ, సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని చెప్పారు.
ఆవు పేడ వంటి సహజ ఎరువుల వినియోగం వల్ల నేల సారవంతం పెరగడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ధామి వివరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సహజ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే అవకాశముందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని సీఎం ధామి పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
LIVE: खटीमा के नगला तराई स्थित आवास पर खेतों में जुताई करते हुए
https://t.co/D4IvVEeZUA— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2026
ఉత్తరాఖండ్ ప్రత్యేకత వ్యవసాయం, గ్రామీణ సంస్కృతి, ప్రకృతితో విడదీయరాని బంధం కలిగి ఉందని ముఖ్యమంత్రి ధామి అన్నారు. సంప్రదాయ వ్యవసాయం, ఉద్యానవనం, సహజ సాగు పద్ధతులు, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత వ్యవసాయం వైపు ఆకర్షితులై గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా పొలంలోకి దిగి నాగలి పట్టడం, ఆవు పేడ ఎరువు వేయడం రైతులకు స్ఫూర్తినిచ్చే చర్యగా మారింది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై సమాజంలో మరింత అవగాహన పెంచే ప్రయత్నంగా దీనిని పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..