
ఉత్తరాఖండ్లో మంచు తుఫాన్లో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తున్న సమయంలో అవలాంచ్ కారణంగా దేశంలోని మొట్టమొదటి గ్రామం మాణా సమీపంలోని మంచు కొండల్లో 55 మంది చిక్కుకుపోయారు. వీళ్లంతా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేష్ కోసం పనులు చేస్తున్న కార్మికులే. వారిని కాపాడేందుకు UAVలు, రాడార్లను రంగంలోకి దించారు. అయితే ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది.
మంచుదిబ్బల్లో చిక్కుకుపోయిన 55 మంది కార్మికుల్లో ఇప్పటి వరకు 50 మందిని కాపాడారు. మిగిలిన ఐదుగురిలో ఒకరు లీవ్లో ఉన్నారని అతను క్షేమంగా ఇంటి వద్దే ఉన్నట్టుగా తెలిసింది. దీంతో గల్లంతైన వారి సంఖ్య నాలుగుకి చేరింది. వారికోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అవలాంచ్ వచ్చిన ప్రాంతంలో భారీగా మంచు చరియలు విరిగిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘటనాస్థలంలో సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరో ఐదుగురిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు, సైనిక దళాలు రెస్క్యూ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి.
మంచులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే వారిని హెలికాప్టర్లలో రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సహాయ చర్యలు జరుగుతున్న తీరును ప్రధాని మోదీ కూడా అడిగి తెలుసుకున్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామితో ఆయన మాట్లాడారు. కార్మికులను కాపాడేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
శుక్రవారం జరిగిన హిమపాతం సంఘటన సమాచారం అందింన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక MI-17 హెలికాప్టర్, మూడు చీతా హెలికాప్టర్లు, రెండు ఉత్తరాఖండ్ ప్రభుత్వ హెలికాప్టర్లు, AIIMS రిషికేశ్ ఎయిర్ అంబులెన్స్తో సహా విస్తృతమైన వైమానిక రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.. అవసరమైతే అదనపు హెలికాప్టర్లను రప్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సైన్యం, ITBP, BRO , NDRF, SDRF, జిల్లా పరిపాలన, పోలీసులు, ఆరోగ్య శాఖ, అగ్నిమాపక సేవలతో సహా విపత్తు నిర్వహణ దళాల నుండి దాదాపు 200 మంది సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..