చేసిన కష్టం అడిగితే ఇంత దారుణమా..? రూ. 100 కోసం యువకుడి దారుణ హత్య!

ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని కాకదేవ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఒక యువకుడు తన స్నేహితుల నుండి కష్టపడి సంపాదించిన డబ్బుకు రూ. 100 అడిగినప్పుడు, అతని స్నేహితులు అతన్ని దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మరొకరు కోసం గాలింపు చేపట్టారు.

చేసిన కష్టం అడిగితే ఇంత దారుణమా..? రూ. 100 కోసం యువకుడి దారుణ హత్య!
Rs 100

Updated on: Feb 15, 2025 | 5:35 PM

రాను రాను మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. క్షణికావేశం ప్రాణాలనే తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లో ఒక యువకుడు తన కష్టానికి రూ.100 అడిగినందుకు, అతని స్నేహితులే కొట్టి చంపారు. ఆ వ్యక్తి దాదాపు 4 నెలల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడి చివరకు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఒక నిందితుడిని కూడా అరెస్టు చేశారు. హత్య తర్వాత ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సంఘటన కాన్పూర్‌లోని కాకదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్‌లో జరిగింది. అక్కడ అంకిత్ అనే వ్యక్తి పని చేసినందుకు తన జీతం అడిగిన పాపానికి, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, అంకిత్ అనే వ్యక్తి పెళ్ళి శకటాలలో పాత్రలు పోషించేవాడు. అతను శకటంలో పనిచేసిన ప్రతిసారీ అతని బృందం అతనికి కొన్ని రూపాయలు ఇచ్చేది. 2024 అక్టోబర్ 7న, అతనితో పాటే ఉండే సూరజ్, బాబా అనే ఇద్దరు యువకులు అంకిత్‌ను ఒక కార్యాక్రమానికి తీసుకెళ్లారు.

అయితే ఇంతలో తీవ్రంగా గాయపడ్డ అంకిత్ ఆసుపత్రిలో చేరాడని రెండు రోజుల తర్వాత తనకు తెలిసిందని అంకిత్ తల్లి పోలీసులకు తెలిపింది. అంకిత్‌ స్పృహ వచ్చిన తర్వాత తల్లికి జరిగిన విషయం చెప్పాడు. సూరజ్, బాబా అనే ఇద్దరు అతన్ని ఒక కార్యక్రమానికి తీసుకెళ్లారని చెప్పాడు. అంకిత్ కు రూ. 300 నిర్ణయించారు. కానీ, సూరజ్, బాబా అంకిత్‌కి రూ. 200 ఇచ్చి వెళ్ళిపోమన్నారు. అంకిత్ ఇంకా 100 రూపాయలు అడిగినప్పుడు, సూరజ్, బాబా గొడవపడి అంకిత్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అంకిత్‌ను చూసి, నిందితులు అక్కడి నుండి పారిపోయారు. అంకిత్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.

అంకిత్ కుటుంబ పరిస్థితి బాగాలేదు. అయినప్పటికీ ఆ వృద్ధ తల్లి తన కొడుకుకు చికిత్స చేయించుకుంటోంది. చివరికి, 4 నెలల తర్వాత, అతను మరణించాడు. ఆ వ్యక్తి మరణం తర్వాత సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయగా, మిగతా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..