ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. నమ్మి వెళ్తే నట్టేట ముంచారు.. వితంతువుపై సామూహిక అఘాయిత్యం!

సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ కేవలం యువత కాలక్షేపానికే కాదు, నేరస్థులకు అమాయక బాధితులను వేటాడేందుకు ఒక సాధనంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఒక నిరుపేద వితంతువుకు ఎదురైన భయంకరమైన ఘటనే దీనికి నిదర్శనం. మొదట సానుభూతి నటిస్తూ, ఆపై ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని నిందితులు ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. నమ్మి వెళ్తే నట్టేట ముంచారు.. వితంతువుపై సామూహిక అఘాయిత్యం!
Reresentive Image

Updated on: Jun 25, 2026 | 3:10 PM

సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ కేవలం యువత కాలక్షేపానికే కాదు, నేరస్థులకు అమాయక బాధితులను వేటాడేందుకు ఒక సాధనంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఒక నిరుపేద వితంతువుకు ఎదురైన భయంకరమైన ఘటనే దీనికి నిదర్శనం. మొదట సానుభూతి నటిస్తూ, ఆపై ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని నిందితులు ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశారు.

బాధితురాలి కథనం ప్రకారం.. 2025లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాస్‌గంజ్ జిల్లాకు చెందిన శివకుమారి అనే మహిళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. మాటలు కలిసి ఇద్దరూ సన్నిహితులయ్యారు. బాధితురాలికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడని, ఆమె వితంతువు అని తెలుసుకున్న శివకుమారి.. నోయిడాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి వల విసిరింది. ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో బాధితురాలు 2025 అక్టోబర్ 10న ఉన్నావ్‌లోని గడన్ఖేడా బైపాస్‌కు చేరుకుంది. అప్పటికే అక్కడ కారుతో సిద్ధంగా ఉన్న శివకుమారి కొడుకు అతుల్, అతని స్నేహితుడు సచిన్ భాటి ఆమెను నోయిడాకు తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో బంధించి, మొదట ఆమెతో బలవంతంగా ఇంటి పనులు చేయించుకున్నారు.

నోయిడాకు వచ్చిన నాలుగు రోజులకే, అంటే అక్టోబర్ 14న, శివకుమారి, ఆమె కొడుకు అతుల్, కుమార్తె, బావ, సచిన్ భాటి కలిసి బాధితురాలిని చంపేస్తామని బెదిరించారు. కోర్టులో అతుల్‌తో బలవంతంగా వివాహం జరిపించారు. పెళ్లి కాగానే నిందితుల అసలు రంగు బయటపడింది. బాధితురాలిని ఇతర పురుషులతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు. ఆమె నిరాకరించినప్పుడల్లా దారుణంగా కొట్టి, హింసించారు.

ఈ నరకయాతన మధ్యే బాధితురాలు గర్భవతి అయి, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయినా నిందితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. పాప పుట్టిన కొన్ని నెలల తర్వాత, బాధితురాలికి ఆహారంలో అధిక మోతాదులో మత్తుమందులు ఇవ్వడం ప్రారంభించారు. ఆమె స్పృహ కోల్పోయిన తరుణంలో, బయటి వ్యక్తులను, క్లయింట్లను పిలిపించి ఆమెపై నిరంతరం సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. ఎదురుతిరిగితే తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేశారు.

రహస్య సమాచారంతో విముక్తి..!

ఒకరోజు నిందితుడి ఫోన్ దొరకడంతో, బాధితురాలు రహస్యంగా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆమె సోదరుడికి సమాచారం ఇవ్వడంతో, అతను వచ్చి ఆమెను ఆ నరకం నుండి రక్షించి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, బాధితురాలు బిఘాపూర్ కోత్వాలి పోలీసులకు, ఉన్నావ్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, పలుకుబడి ఉన్న నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పోలీసుల అలసత్వంతో విసిగిపోయిన బాధితురాలు న్యాయం కోసం సివిల్ జడ్జి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీవ్రంగా స్పందిస్తూ కఠిన ఆదేశాలు జారీ చేయడంతో.. ఎట్టకేలకు బిఘాపూర్ కోత్వాలి పోలీసులు అత్త శివకుమారి, భర్త అతుల్, ఆడపడుచు, బావ, సచిన్ భాటిలపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైందని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు ప్రారంభించామని స్టేషన్ ఇన్‌చార్జ్ అరవింద్ కుమార్ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us