యూపీలో అమానుషం.. మాస్కు ధరించలేదని.. యువకుడికి మేకులు దించిన పోలీసులు

Uttar pradesh bareilly police: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో కఠినంగా లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సంయమనం

యూపీలో అమానుషం.. మాస్కు ధరించలేదని.. యువకుడికి మేకులు దించిన పోలీసులు
Bareilly Police

Updated on: May 27, 2021 | 7:35 AM

Uttar pradesh bareilly police: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో కఠినంగా లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సంయమనం కోల్పోతున్నారు. తాజాగా.. మాస్కు ధరించలేదని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఓ వ్యక్తి పట్ల అమానుషంగా వ్యవహరించారు. అతడి చేతికి, కాలికి మేకులు దించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన బరేలీలోని బరాదరీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటన అనంతరం బాధితుడి తల్లి పోలీసు అధికారులను ఆశ్రయించడంతో ఇది కాస్తా వెలుగులోకి వచ్చింది. మే 24 రాత్రి 10 గంటల ప్రాంతంలో తనతోపాటు తన కుమారుడు ఇంటి ముందు కూర్చున్నామని, అంతలో అక్కడికి వచ్చిన ముగ్గురు స్థానిక పోలీసులు ఇలా చేశారని ఆమె అధికారులకు వెల్లడించింది.

ఇంటి ముందు కూర్చున్న తమను మాస్కులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించి, తన కుమారుడితో దురుసుగా వ్యవహరించారని తెలిపింది. అంతలో వాగ్వాదం జరగడంతో తన కుమారుడిని తీసుకెళ్లిపోయారని ఆమె వివరించింది. స్థానిక పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లి వారిని అడిగితే.. తన కుమారుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించింది. మరుసటి రోజు తెల్లవారుజామున తన కుమారుడు తీవ్ర గాయాలతో.. చేతికి, కాలికి మేకులతో దయనీయ స్థితిలో కనిపించినట్లు తెలిపింది.

ఈ మేరకు ఆమె బుధవారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి న్యాయం చేయాలని రోదించింది. కాగా ఈ విషయంపై ఎస్పీ రోహిత్‌ సజ్వాన్‌ మీడియాతో మాట్లాడారు. సదరు వ్యక్తిపై పలు పోలీసుస్టేషన్లలో పలు కేసులున్నాయని తెలిపారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే వారు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని.. వారి ఆరోపణలన్నీ నిరాధారమైనవంటూ పేర్కొన్నారు.

Also Read:

California firing: తోటి ఉద్యోగులపై కాల్పులు.. ఎనిమిది మంది మృతి.. కాలిఫోర్నియా లైట్‌ రెయిల్‌ యార్డులో ఘటన

Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం