
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత ప్రభుత్వం కీలక ప్రతినిధి బృందాన్ని పంపనుంది. ఈ అధికారిక పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటతో పాటు, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అత హస్నైన్ ఇరాన్ వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సోమవారం (జూన్ 29) తెలిపాయి.
మధ్యప్రాచ్య రాజకీయాల్లో దశాబ్దాల పాటు అత్యంత కీలక పాత్ర పోషించిన ఖమేనీ అంత్యక్రియలకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇరాన్తో ఉన్న దౌత్యపరమైన, చారిత్రాత్మక సంబంధాలను పురస్కరించుకుని భారతదేశం తరఫున ఒక కేంద్ర మంత్రిని, అలాగే ముస్లిం సమాజంలో, సైన్యంలో ఉన్నతమైన గుర్తింపు ఉన్న బీహార్ గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత ప్రభుత్వం తరఫున ఇరాన్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు తమ సెంటిమెంట్లను, అధికారిక సంతాప సందేశాన్ని తెలియజేయనుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సజావుగా సాగుతున్న తరుణంలో, ఈ పర్యటన అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
86 ఏళ్ల ఖమేనీ, టెహ్రాన్పై ఇజ్రాయెల్ – అమెరికా వైమానిక దాడులు ప్రారంభమైన మొదటి రోజైన ఫిబ్రవరి 28న హత్యకు గురయ్యారు. ఆయన 36 ఏళ్లపాటు ఇస్లామిక్ రిపబ్లిక్కు సర్వోన్నత నాయకుడిగా నాయకత్వం వహించారు. అంత్యక్రియల ఏర్పాట్లలో భాగంగా, టెహ్రాన్కు దక్షిణాన ఉన్న మరో పవిత్ర నగరమైన ఖోమ్లో జూలై 7న కార్యక్రమాలు జరుగుతాయని ప్రభుత్వ మీడియా తెలిపింది. ఫిబ్రవరిలో ఖమేనీ హత్య జరిగినప్పటి నుండి ఆయన అంత్యక్రియల తేదీపై ఊహాగానాలు చెలరేగాయి. ఇస్లామిక్ చట్టం ప్రకారం, మృతులను వీలైనంత త్వరగా, మరణించిన ఒక రోజులోనే ఖననం చేయాలి. అయినప్పటికీ, ముఖ్యంగా యుద్ధ సమయంలో మినహాయింపులు అనుమతిస్తారు. మొదట ఆయనను జూన్ చివరిలో ఖననం చేయవచ్చని చెప్పగా, ఆ తర్వాత అంత్యక్రియలు జూలైలో జరుగుతాయని ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఖమేనీ అంత్యక్రియలకు టెహ్రాన్, మషద్, ఖోమ్ నగరాల వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది హాజరవుతారని అంచనా.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…