Pm Modi – Amit Shah: ప్రధాని మోదీ నిర్ణయం ఎలా తీసుకుంటారో తెలుసా?.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమిత్ షా..

|

Oct 10, 2021 | 6:25 PM

Pm Modi - Amit Shah: 2014 నుంచి ఇప్పటి వరకు భారత ప్రధాన మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ పాలన సాగిస్తున్నారు పీఎం నరేంద్ర మోదీ. తన విభిన్న శైలితో..

Pm Modi - Amit Shah: ప్రధాని మోదీ నిర్ణయం ఎలా తీసుకుంటారో తెలుసా?.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమిత్ షా..
Modi Amit Shah
Follow us on

Pm Modi – Amit Shah: 2014 నుంచి ఇప్పటి వరకు భారత ప్రధాన మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ పాలన సాగిస్తున్నారు పీఎం నరేంద్ర మోదీ. తన విభిన్న శైలితో యావత్ దేశ ప్రజానికాన్నే కాక.. ప్రపంచ దేశాలను సైతం తన వైపునకు తిప్పుకుంటున్నారు. అయితే, ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణి కలిగి ఉంటారని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. కేంద్ర మంత్రులను, అధికార యంత్రాంగాన్ని మొత్తం తన గ్రిప్‌లో పెట్టుకుని.. ఏకపక్షంగా వ్యవహరిస్తారని అంటుంటారు. అయితే, ఇదే అంశంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ప్రశ్న లేవనెత్తారు ఓ జాతీయ మీడియా ప్రతినిధి. దీనికి ఆయన చాలా ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు. అంతేకాదు.. ప్రధాని మోదీకి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

ప్రధాని మోదీ నిరంకుశ పద్ధతిలో నిర్ణయం తీసుకుంటారా? అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘మోడీ లాంటి శ్రోత ను నేనెప్పుడూ చూడలేదు. ఏ సమావేశంలో అయినా ఆయన అతి తక్కువ మాట్లాడుతారు. ప్రతీ ఒక్కరు మాట్లాడేది ఓపిగా వింటారు. విషయ పరిజ్ఞానం ఆధారంగా ప్రతి వ్యక్తి సూచనలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు.’’ అని తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ..గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారత ప్రధానిగా 7 ఏళ్లు, మొత్తం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీపై మోపని నిందంటూ లేదు. కానీ, ఆయన అన్నింటినీ అధిగమించారు. ప్రతిపక్షాలే ప్రధాని మోదీని మరింత బలవంతుడిని చేస్తాయని ఆయన భావన. ప్రజల పట్ల ఆయనకు అపార విశ్వాసం ఉంది. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశం కోసమే అని ప్రజలకు బాగా తెలుసు. ఈ నిర్ణయాల వల్లే దేశానికే ఉపయోగం తప్ప.. ఆయనకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే కొన్ని విషయాల్లో పొరపాట్లు జరిగినా..ప్రజలు తమను క్షమించారు.’’ అని అమిత్ షా తెలిపారు.

‘‘భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఏ భారతీయ ప్రధాన మంత్రి కూడా చెప్పలేదు. ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది. త్వరలోనే 5వ స్థానానికి చేరుకుంటుంది. భారత్ త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే నమ్మకం నాకు ఉంది.’’ అని అమిత్ షా పేర్కొన్నారు.

ఇంకా ఏమన్నారంటే.. ‘‘ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో ఆయన ప్రారంభ రోజులు. రెండవది, గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలం. మూడవది, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం. మోడీ.. తన అకుంఠిత శ్రమ, వ్యూహాత్మక విధానాలతో, పకడ్బందీ కార్యాచరణ అమలు చేయడం ద్వారా గుజరాత్‌లో బీజేపీని బలోపేతం చేశారు. ఇక భారత ప్రధానిగా నరేంద్ర మోదీ.. గత ఏడు సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, సంస్కరణలు తీసుకువచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఇదే సమయంలో రైతు ఉద్యమంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక కామెంట్స్ చేశారు. రైతుల నిరసనలు, ఆందోళనలు అర్థం లేనివి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలు రైతులకు మేలు చేసేవే తప్ప.. హానీ తలపెట్టవని స్పష్టం చేశారు. వామపక్ష భావజాలం పేదల సంక్షేమం కోసం కాదని, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి.. పేదల ఆగ్రహాన్ని క్యాపిటలైజ్ చేయడానికి ఇది ఒక మార్గం అని విమర్శించారు. వామపక్ష పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసునని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Also read:

Maa Elections: ఈసారి ఓటు వేయని స్టార్ హీరోలు, హీరోయిన్లు వీరే… చివరి నిమిషంలో అనసూయ ఓటు..

IIT Kanpur: ఐఐటీలో సీటు సాధించిన పెట్రోల్ పంప్‎ కార్మికుడి కుమార్తె.. ట్వీట్ చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్

Guntur: గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని నడింపాలెం జాతీయ రహదారిపై జోరుగా వ్యభిచారం