Two Special Trains: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. ఇక రైలు ప్రయాణంలో తక్కువ చార్జీలు ఉండటం కారణంగా చాలా మంది రైళ్లల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్కు వచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈనెల 17న నర్సాపూర్ – సికింద్రాబాద్, కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లను పడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
17న రాత్రి 8 గంటలకు నర్సాపూర్లో బయలుదేరనున్న సంక్రాంతి ప్రత్యేక రైలు ఆ మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనుంది. అలాగే కాకినాడ టౌన్ నుంచి 17న సాయంత్రం 6 గంటలకు బయలుదేరే రైలు.. ఆ మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, ద్వారపూడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.