
భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావులు, వ్యాపార దిగ్గజాలు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి వచ్చారు. టీవీ9 నెట్వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే 2026 సదస్సు దేశ రాజధాని న్యూఢిల్లీలో కొనసాగుతోంది. భారతదేశం – ప్రపంచం అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ రెండ్రోజుల సదస్సు, దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక గొప్ప మేధోమథన వేదికగా నిలిచింది. ఈ సదస్సులో భాగంగా రెండో రోజు మంగళవారం (మార్చి 24) జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు
టీవీ9 న్యూస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి పలువురు ప్రముఖ నాయకులు హాజరై ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని రాజ్యాంగం ప్రకారమే పాలించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్నట్లుగా దేశాన్ని ఎవరి ఇష్టానుసారం నడపలేమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ చమురు కొనుగోళ్లను నిర్దేశించడానికి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఎవరని ఆయన ప్రశ్నించారు.
భారతదేశానికి మతం లేదని ఒవైసీ అన్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతా ఒకే మతం ఉందని చెబుతోంది. ఒక సిద్ధాంతం ఉండాలి. మా సిద్ధాంతం హిందుత్వ అని బీజేపీ చెబుతోంది. మేము దానిని సమర్థించమని ఒవైసీ తేల్చి చెప్పారు. ముస్లింలు భారతదేశానికి అంగారక గ్రహం నుండి రాలేదని ఒవైసీ అన్నారు. మనమందరం ఈ భూమికి చెందినవారమే. భారతదేశం అందరిది. ఈ రోజు భారతదేశాన్ని ప్రేమించడం నేర్పుతున్న వారిని మునుపెన్నడూ చూడలేదన్న ఒవైసీ.. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా సర్టిఫికెట్లు జారీ చేయడం సులభమన్నారు.
‘‘అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి మన దేశానికి వచ్చి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అయినా మనం దాని గురించి ఏమీ అనలేకపోతున్నాం. మనం చమురు కొనుగోలు చేయడానికి అమెరికాను అనుమతి అడుగుతున్నాం. ఇదివరకు భారతదేశం ఇలా ఉండేది కాదు. మన ప్రభుత్వం అమెరికాను యాచిస్తోంది’’ అని ఒవైసీ విమర్శించారు. ఇదేనా భారతదేశం? మనం రష్యా నుండి చమురు కొనడానికి అమెరికా ఎవరు? అని అసద్ ప్రశ్నించారు. ‘‘ఈ రోజు దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇరాన్పై దాడి జరిగింది, కానీ ఐదు రోజుల తర్వాత భారతదేశం కప్పం చెల్లించింది. అందరి ఓడలూ సులభంగా వెళ్ళిపోతున్నా, మనం మాత్రం ఓడలను ఖాళీ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు వరకూ మన బియ్యం, పండ్లు రవాణా మధ్యలోనే నిలిచిపోయాయి.’’ అని అసదుద్దీన్ అన్నారు.
“గంగా నదిలో ఆహారం తినడాన్ని ఏ చట్టం నిషేధిస్తుంది? అలాంటి చట్టం ఏదీ లేదు. వారణాసి ఘటనలో ప్రజలను తప్పుగా ఇరికించారు. ప్రజలు ఈ విషయాన్ని రాజకీయం చేశారు. ఆ అబ్బాయిలు మాంసం తింటున్నట్లు చూపించే ఒక్క వీడియో కూడా లేదు,” అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గంగానదిలో మురుగునీరు కలుస్తుందన్నది నిజమేగా? గంగానది గంగామాత అయితే, ఆమెను ఎందుకు సంరక్షించిడం లేదు? ఆమెను ఎందుకు శుభ్రంగా ఉంచడం లేదు? ఈద్ పండుగ జరుపుకోవడానికి ముస్లింలు హైకోర్టుకు వెళ్లాల్సిన దేశం ఇది అని, మరోవైపు రక్తసిక్తమైన హోలీతో వారిని బెదిరిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై అసదుద్దీన్ ఒవైసీ సూటిగా ప్రశ్నలు సంధించారు. యుద్ధం సంభవించే అవకాశం ఉందని చాలా కాలంగా అందరికీ తెలిసినప్పుడు ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఆయన వెళ్లి వచ్చిన కొద్దికాలానికే యుద్ధం మొదలైందన్నారు. దాని పర్యవసానాలను ప్రతిఒక్కరూ అనుభవించారు. దేశం చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, కేవలం ఐదు రోజులకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉందని అసద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం గురించి మాట్లాడుతూ, అది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోందని ఒవైసీ అన్నారు.
యుద్ధం మధ్యలో, ఇస్లాం, వ్యక్తిగత ముస్లింల గురించి ప్రశ్నలు తలెత్తాయి. దానికి ఒవైసీ స్పందిస్తూ.., “ఇస్లాం ఎవరి సొంత ఆస్తి కాదు. అక్కడ అల్-అక్సా మసీదు ఉంది, కాబట్టే ముస్లింలు పాలస్తీనాను ఆకాంక్షిస్తున్నారు. అంతకు మించి మరేమీ లేదు. మనం దేశాల నుండి చమురును ఉచితంగా కొనము. డబ్బు చెల్లించి కొంటాము. ఇక్కడ కూడా అదే చేస్తాము.” అని అసద్ పేర్కొన్నారు.
అఖిలేష్ యాదవ్, పీడీఏను లక్ష్యంగా చేసుకున్న అసదుద్దీన్ తీవ్రంగా విమర్శించారు. అఖిలేష్ కేవలం పీడీఏ గురించి మాత్రమే మాట్లాడతారని, కానీ ఆయన ఫార్ములాలో ముస్లింలను అసలు చేర్చలేదని ఆయన అన్నారు. ఆయన తన సొంత రాజకీయాలు చేస్తున్నారు. ఇవి ఆయన మాటలు, ఇందులో మరెవరి ప్రమేయం లేదు. మేము యూపీకి వెళ్లినప్పుడు, ఆయన మరోసారి మాపై ఆరోపణలు చేస్తారని ఒవైసీ అన్నారు. ఎస్పీతో చేతులు కలపడం గురించి ఆయన మాట్లాడుతూ, “మమ్మల్ని ఎలా దూషించారో బీహార్లో అందరూ చూశారు. మేమే చేతులు కలపడం గురించి మాట్లాడుతుంటే, వాళ్లు కనీసం ఒక్కసారైనా మాతో మాట్లాడాలి” అని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..