శివసేన కొంపముంచింది ఆ ఇద్దరే..!

| Edited By: Srinu

Nov 23, 2019 | 1:10 PM

నెల రోజుల పాటు కొనసాగిన హైడ్రామా తర్వాత ఎట్టకేలకు మహారాష్ట్రలో బిజెపి-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ రాజకీయ నాటకంలో శివసేన పూర్తిగా కుదేలవగా.. బిజెపి బంపర్ విక్టరీ కొట్టేసింది. అటు కాంగ్రెస్ పార్టీ చిరకాలంగా తగిలించుకున్న సెక్యులర్ పార్టీ ముద్రను శివసేనతో అంటకాగడం వల్ల కోల్పోయినట్లయింది. ఇటు డబుల్ గేమ్ ఆడిన ఎన్సీపీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం పంచుకోవడంతోపాటు కేంద్రంలోను మంత్రి పదవులను పొందబోతోంది. అయితే.. ఈ రాజకీయ సంక్షోభానికి కారణమైన శివసేనను ఆ దిశగా నెట్టిందెవరు […]

శివసేన కొంపముంచింది ఆ ఇద్దరే..!
Follow us on

నెల రోజుల పాటు కొనసాగిన హైడ్రామా తర్వాత ఎట్టకేలకు మహారాష్ట్రలో బిజెపి-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ రాజకీయ నాటకంలో శివసేన పూర్తిగా కుదేలవగా.. బిజెపి బంపర్ విక్టరీ కొట్టేసింది. అటు కాంగ్రెస్ పార్టీ చిరకాలంగా తగిలించుకున్న సెక్యులర్ పార్టీ ముద్రను శివసేనతో అంటకాగడం వల్ల కోల్పోయినట్లయింది. ఇటు డబుల్ గేమ్ ఆడిన ఎన్సీపీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం పంచుకోవడంతోపాటు కేంద్రంలోను మంత్రి పదవులను పొందబోతోంది. అయితే.. ఈ రాజకీయ సంక్షోభానికి కారణమైన శివసేనను ఆ దిశగా నెట్టిందెవరు ? ఇదిప్పుడు మరాఠాలకు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది.

అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన దరిమిలా నెల రోజులపాటు మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రకరకాల మలుపులు తిరిగాయి. అయితే.. ముందుగా ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలోనే తెర మీదికొచ్చిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. నెల రోజుల డ్రామాలో కీలకపాత్రధారిగా కనిపించారు. ఒక రకంగా చెప్పాలంటే శివసేన-బిజెపి మధ్య సంబంధాలు తెగిపోవడానికి ప్రధాన కారణం సంజయ్ రౌత్ నోటి దురుసనే చెప్పాలి. తన హార్డ్‌కోర్ కామెంట్లతో బిజెపి అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది సంజయ్ రౌత్ అనే తేలింది. ఒక దశలో బిజెపి సీనియర్ నేత నితిన్ గడ్కరీ జోక్యంతో శివసేన-బిజెపి మళ్ళీ దగ్గరవుతాయని భావించిన తరుణంలో సంజయ్ రౌత్ చేసిన కామెంట్లు కాకరేపాయి. రెండు పార్టీల మధ్య దూరం పెంచాయి.

మరోవైపు శివసేన రాజకీయ పార్టీగా మారినప్పట్నించి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా వున్న థాక్రే కుటుంబం నుంచి తొలిసారి పోటీకి దిగింది ఆదిత్య థాక్రే. అయితే ఆదిత్య పోటీ చేయడానికి కారణం తన తండ్రి ఉద్ధవ్ థాక్రే అని అందరూ భావించినా అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో కీలక పాత్రధారి ఉద్ధవ్ థాక్రే సతీమణి రశ్మీ థాక్రే అని తాజాగా తెలుస్తోంది. ఇంకెంతకాలం బిజెపికి సపోర్ట్ చేసే పార్టీగానే వుండిపోతాం మనమూ అధికార పగ్గాలు చేపట్టాల్సిందేనంటూ ఇంటిపోరు మొదలు పెట్టిన రశ్మీ.. ముందుగా ఉద్ధవ్ థాక్రేని పోటీ చేయమని ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. ఆయన ప్రత్యక్ష పోటీకి ససేమిరా అనడంతో తనయుడు ఆదిత్య థాక్రేని ఎన్నికల్లో పోటీకి దింపినట్లు సమాచారం. దాంతో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన తొలి థాక్రే కుటుంబీకునిగా ఆదిత్య మారారు.

అయితే, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రశ్మీ థాక్రే పాత్ర మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై తన భర్త ఉద్ధవ్‌ను చూసుకోవాలన్న ఆకాంక్షతో పేచీ ప్రారంభించారు రశ్మీ. ముందుగా ముఖ్యమంత్రి పదవి శివసేనకిస్తే ఉద్ధవ్ థాక్రేనే పీఠమెక్కాలని ఆమె ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. ఒకవేళ తొలి రెండున్నరేళ్ళు బిజెపి సీఎం సీటు తీసుకుంటే.. ఆదిత్య థాక్రేను ఉప ముఖ్యమంత్రిని చేయాలని రశ్మీ థాక్రే కండీషన్ పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి పీఠంపై థాక్రేలో ఆసక్తిని రేపింది ఆయన సతీమణి రశ్మీ అన్నది ఇప్పుడు మరాఠాల్లో చర్చనీయాంశమైంది.

సో.. తెరమీద సంజయ్ రౌత్.. తెరవెనుక రశ్మీ ఉద్ధవ్ థాక్రే.. ఈ ఇద్దరే ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్‌లో శివసేన కుదేలవడానికి కారణమని తెలుస్తోంది. చిరకాల మిత్రపక్షాన్ని కోల్పోవడంతోపాటు క్రెడిబిలిటీ లేని పార్టీగా శివసేన మారడానికి వీరిద్దరి ప్రవర్తనే కారణమని అంటున్నారు. సీఎం సీటు కోసం కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికి సిద్దపడడం ద్వారా హార్డ్‌కోర్ హిందుత్వ పార్టీగా వున్న ముద్రను కూడా శివసేన కోల్పోయినట్లయ్యింది తాజా పరిణామాల కారణంగా. రెంటికి చెడ్డ రేవడి అన్న సామెత ఇప్పుడు శివసేనకు సరిగ్గా సూట్ అవుతుందనడంతో సందేహం లేదనే చెప్పాలి.