Tejasvi Surya: ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్‌ ఓపెన్‌ వివాదం.. తేజస్వి తీరుపై కాంగ్రెస్‌ ఆగ్రహం..

|

Jan 18, 2023 | 9:12 PM

ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచిన వ్యవహారం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మెడకు చుట్టుకుంది. పొరపాటుగా తాను ఆ పనిచేశారని , అందుకు సారీ చెబుతున్నా అని సూర్య వివరణ ఇచ్చినప్పటికి వివాదం సద్దుమణగడం లేదు. కావాలనే ఈ విషయాన్ని కేంద్రం దాచిపెట్టిందని కాంగ్రెస్‌ విమర్శించింది.

Tejasvi Surya: ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్‌ ఓపెన్‌ వివాదం.. తేజస్వి తీరుపై కాంగ్రెస్‌ ఆగ్రహం..
Tejasvi Surya
Follow us on

ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచిన వ్యవహారం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు పెద్ద తలనొప్పిగా మారింది. పొరపాటుగా తాను విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచినట్టు తెలిపారు తేజస్విసూర్య. ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు సారీ చెబుతున్నట్టు తెలిపారు. అయితే పిల్లాడిని ఎంపీ చేస్తే ఇలాగే ఉంటుందని కర్నాటక కాంగ్రెస్‌ నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. చెన్నై-తిరుచ్చి ఇండిగో విమానంలో గత నెల 10న జరిగిన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను పొరబాటుగా తెరిచారని ఇండిగో మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.

ఇందుకు ఆ ప్రయాణికుడు క్షమాపణ చెప్పినట్లు కూడా పేర్కొంది. అయితే, ఆ ప్రయాణికుడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యనే అని కాంగ్రెస్‌ బయటపెట్టింది. టేకాఫ్‌కు ముందే ఈ ఘటన జరగడం వల్ల ప్రమాదం తప్పిందనీ, లేదంటే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పువాటిల్లి ఉండేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.

తేజస్వి సూర్య వ్యవహారాన్ని న్ని ప్రభుత్వం దాచిపెట్టిందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. దీనిపై పౌర విమానయాన DGCA స్పందిస్తూ.. ఘటన తమ దృష్టికి వచ్చిందని, భద్రతపరమైన లోపాలేమీ లేవని స్పష్టం చేసింది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. పొరపాటుగానే తేజస్విసూర్య డోర్‌ తెరిచారని , అందుకు సారీ కూడా చెప్పారని అన్నారు.

గ్రౌండ్‌ మీదే ఆ ఘటన జరిగింది. పొరపాటు జరిగిన విషయాన్ని తేజస్వి సూర్య స్వయంగా విమానం సిబ్బందికి వెల్లడించారు. అన్ని ప్రోటోకాల్స్‌ పూర్తయ్యాకే విమానం బయలుదేరింది. మొత్తానికి బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడైన తేజస్వి సూర్యకు ఈ వ్యవహారంలో చిక్కులు వచ్చాయి. కర్నాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఆయన కొత్త అస్త్రాన్ని ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం