
సాధారణంగా ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటు హక్కు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకునే హామీలు ప్రకటిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా, అసలు ఓటు హక్కు లేని నవజాత శిశువుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని ప్రకటించింది. పార్టీ స్థాపించిన తొలి ప్రయత్నంలోనే భారీ ఆదిక్యతతో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన టీవీకే ప్రభుత్వం, ఇప్పటికే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి దళపతి విజయ్ తాజాగా మరో సరికొత్త పథకాన్ని ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
పుట్టిన బిడ్డకు గ్రాము బంగారం
నవజాత శిశువుల కోసం ప్రభుత్వం మేనమామ కానుక పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారాన్ని ప్రభుత్వం తరఫున అందించనున్నారు. దీంతో ఇటీవల పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు ఈ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
ఈ నెలాఖరు నాటికి మేనమామ కానుకను లబ్ధిదారులకు అందించేందుకు అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తాజాగా పుట్టిన పిల్లల వివరాలను సేకరిస్తూ అధికారులు పూర్తి స్థాయి జాబితాను రూపొందిస్తున్నారు. ఈ కసరత్తు పూర్తయిన వెంటనే అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
ఎన్నికల హామీలు అంటే కేవలం ఓటర్లకే ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయనే సంప్రదాయానికి భిన్నంగా, ఓటు హక్కు లేని చిన్నారులను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.