
తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, స్వచ్ఛతను తీసుకురావడమే లక్ష్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని బలోపేతం చేస్తూ ఒక సాహసోపేతమైన సరికొత్త ప్రోత్సాహక పథకాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన విధానం ప్రకారం ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే, మీ నుండి కేవలం రూ.1000 లంచం డిమాండ్ చేసినా.. ప్రజలు సాక్ష్యాధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ.1,00,000 నగదు బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇందుకోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రవేశపెట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా టీవీకే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రచార సమయంలోనే తాము అధికారంలోకి వస్తే ఆధార్ కార్డు తరహాలో తమిళనాడు పౌరసత్వ కార్డును జారీ చేస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబం సమగ్ర సమాచారంతో కూడిన ఈ కార్డు ద్వారా, పౌరులు ఎలాంటి దరఖాస్తులు చేసుకోకుండా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పుట్టినప్పటి నుంచే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నేరుగా వారి ఇంటి వద్దకే శాస్త్రీయ పద్ధతిలో అందుతాయని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 108 సీట్లతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మంత్రి అధవ్ అర్జున తొలిసారిగా ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, పరిపాలనా పారదర్శకతను పెంచే చర్యలపై చర్చించారు.
అవినీతిపైనే కాకుండా రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ మద్యం రవాణాపై కూడా సీఎం విజయ్ యుద్ధం ప్రకటించారు. తమిళనాడులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ కొన్నా, అమ్మినా గూండా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. “ప్రజల డబ్బులోంచి నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోను, అవినీతి రహిత పాలనను అందిస్తాను” అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వంద శాతం తుడిచిపెట్టేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ మద్యం దుకాణాల తొలగింపుతో పాటు పోలీస్ స్టేషన్లలో పౌరులు ఫిర్యాదు చేసేటప్పుడు పారదర్శకత కోసం వీడియో తీసే విధానాన్ని తేవడం, అధికార పార్టీ సభ్యులెవరూ తమ పేరు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో జోక్యం చేసుకోకూడదని కఠిన ఆదేశాలు జారీ చేయడం వంటి నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
మరోవైపు సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం లంచాలకు అలవాటుపడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు సీఎం విజయ్ స్వయంగా ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా ప్రతిరోజూ సచివాలయ కార్యాలయానికి కరెక్ట్ సమయానికి వచ్చి విధులు నిర్వర్తించడం అధికారులందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆదర్శంగా నిలుస్తూ, అవినీతి నిరోధానికి తీసుకుంటున్న ఈ సంచలన చర్యలను సామాన్య ప్రజలు, పేదవారు సాదరంగా స్వాగతిస్తున్నారు.