Taj Mahal: పండు వెన్నెల్లో పాలరాతి అపురూపం.. రాత్రి సమయాల్లో తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్

|

Aug 21, 2021 | 11:24 AM

చారిత్రక కట్టడం, పాలరాతి అపురూపం తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్‌మ‌హ‌ల్‌ను వీక్షించేందుకు అవకాశం..

Taj Mahal: పండు వెన్నెల్లో పాలరాతి అపురూపం.. రాత్రి సమయాల్లో తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్
Taj Mahal
Follow us on

Taj Mahal: చారిత్రక కట్టడం, పాలరాతి అపురూపం తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్‌మ‌హ‌ల్‌ను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. రాత్రి వేళ‌ల్లో తాజ్‌మ‌హ‌ల్‌ను వీక్షించేందుకు సంద‌ర్శకుల‌కు అనుమ‌తి ల‌భించింది. క‌రోనా మహమ్మారి విజృంభణ కారణంగా గతేడాది మార్చి నెల‌లో రాత్రి వేళ‌ల్లో తాజ్‌మ‌హ‌ల్ సంద‌ర్శన‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 17 నెల‌ల త‌ర్వాత తాజ్‌మ‌హ‌ల్ రాత్రి సంద‌ర్శన‌కు అనుమ‌తి రావ‌డంతో ప‌ర్యాట‌కులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారంలో శుక్ర, ఆదివారాలు మిన‌హా తాజ్‌మ‌హ‌ల్ రాత్రి సంద‌ర్శన‌కు అనుమ‌తి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ప‌ర్యాట‌కుల కోసం మూడు స్లాట్‌ల‌ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. రాత్రి 8:30 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అర గంట చొప్పున మూడు స్లాట్‌లు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గద‌ర్శకాల మేర‌కు ప్రతి స్లాట్‌లో 50 మంది ప‌ర్యాట‌కుల‌కు మాత్రమే అనుమ‌తి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక మీదట యథావిథిగా అందరికీ తాజ్ మహాల్ అందాలను తిలకించే అవకాశం కల్పించనున్నారు. తాజ్ మహల్ సందర్శనకు ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోన్ ద్వారా గరిష్ఠంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. తాజ్ మహల్ సందర్శనకు విడతకు 650 మందికి మాత్రమే అనుమతించారు.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌‌లో నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను ఏప్రిల్‌ 15నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో.. పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజ్‌మహల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్మారక కేంద్రాలను తెరుచుకున్నాయి. జూలై 6 నుంచి అన్ని స్మారక కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో వెన్నెల కాంతుల్లో తాజ్ మహల్ వీక్షణకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, పర్యాటకులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. పర్యాటకుల సందర్శనకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Read Also… Tiger: కుమ్రం భీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. భయంతో వణికిపోతున్న జనం