
ఒకవైపు మంగళవాయిద్యాలు, మరోవైపు బంధుమిత్రుల కోలాహలంతో ఆ పెళ్లి వేదిక కళకళలాడుతోంది. సరిగ్గా వరుడు, వధువు దండలు మార్చుకుంటున్న వేళ.. ఆ సంతోషం ఒక్కసారిగా విషాదంగా మారింది. ముసుగు ధరించి వచ్చిన ఒక వ్యక్తి, అందరూ చూస్తుండగానే వధువుపై కాల్పులు జరిపి పారిపోయాడు. బీహార్లోని బక్సర్ జిల్లా చౌసా నగర్ పంచాయతీలో ఈ దారుణం చోటుచేసుకుంది. నంద్జీ మల్లా కుమార్తె ఆర్తి కుమారికి ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి వేడుక ఘనంగా జరుగుతోంది. స్టేజ్ మీద వేడుక సాగుతుండగా, ఒక ఆగంతకుడు వేదికపైకి వచ్చి… తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆర్తి కడుపులో కాల్చాడు. సంగీత హోరులో మొదట ఆ శబ్దం ఎవరికీ వినిపించలేదు కానీ ఆర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆర్తిని వెంటనే బక్సర్ సదర్ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వారణాసికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతోంది. అయితే స్పృహ కోల్పోయే ముందు ఆర్తి తన కుటుంబ సభ్యులతో ఒక కీలక విషయం చెప్పింది. తనను కాల్చింది పొరుగునే ఉండే దీనబంధు అని పేరు వెల్లడించింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. దీనబంధు గత రెండేళ్లుగా ఆర్తిని వేధిస్తున్నాడు. ఆమె అతనిని తిరస్కరించినప్పటికీ, ప్రేమ పేరుతో వెంటాడేవాడు. గతంలో ఆర్తికి మరో సంబంధం కుదిరినప్పుడు, వరుడి కుటుంబాన్ని బెదిరించి ఆ పెళ్లిని కూడా చెడగొట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ముఫాసిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఇది వ్యక్తిగత కక్షతో జరిగిన దాడిగానే కనిపిస్తోందని, నిందితుడు దీనబంధు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.
A guy who got rejected sh@t an 18-year-old bride right during her jaimala ceremony in Buxar, Bihar. She is in very critical condition and fighting for life in ICU.
pic.twitter.com/jQ3PrHq6PN— Ghar Ke Kalesh (@gharkekalesh) February 25, 2026