
తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షకు ముందు టీవీకేకు బిగ్ షాక్ తగిలింది. తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి కేవలం ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో జరగబోయే కీలకమైన బలపరీక్ష ఓటింగ్లో ఆయన పాల్గొనవద్దని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపత్తూర్ స్థానంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియకరుప్పన్పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగాయని, కౌంటింగ్లో పొరపాట్లు ఉన్నాయంటూ పెరియకరుప్పన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస సేతుపతిని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించకుండా నిలువరించాలని ఆయన తన పిటిషన్లో కోరారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. లెక్కింపులో స్పష్టత వచ్చే వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు శ్రీనివాస సేతుపతి ఎలాంటి అధికారిక నిర్ణయాల్లో గానీ, అసెంబ్లీ ఓటింగ్లో గానీ పాల్గొనకూడదని స్పష్టం చేసింది. దీంతో శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినా, ఓటు హక్కును కోల్పోనున్నారు. రాబోయే స్పీకర్ ఎన్నిక, బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి ఒక ఓటు తగ్గనుంది.
తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ టీవీకేకు ప్రస్తుతం 120 మంది సభ్యుల మద్ధతు ఉంది. టీవీకే 107మందితో పాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు ఆయనకు మద్ధతు ఇస్తున్నాయి. ఈ పార్టీల మద్దతుతో పాటు అన్నాడీఎంకేలోని షణ్ముగం వర్గం సైతం విజయ్కు జై కొట్టింది. ఈ క్రమంలో విజయ్ బలపరీక్షలో చాలా ఈజీగా గట్టెక్కుతారని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కోర్టు తిరుపత్తూర్ నియోజకవర్గంలో రీకౌంటింగ్కు ఆదేశించినా తామే మళ్లీ గెలుస్తామని టీవీకే ధీమా వ్యక్తం చేస్తుంది.