
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్..విచారణలో వేగం పెంచింది. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ED బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి. కేరళ పోలీసుల FIR ఆధారంగా ED కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.. తిరువనంతపురంలోని దేవస్థాన బోర్డు హెడ్క్వార్టర్స్, ఇతర నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావన్కోర్ దేవశ్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్లకు సంబంధం ఉన్న ప్రాంతాల్లోను, వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు.
మరోవైపు ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం.. శబరిమల ఆలయం నుంచి అంచనాకు మించి బంగారం చోరీ అయినట్టు గుర్తించింది. ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలు, ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లు రెండు కేసులు నమోదు చేసింది. అయితే బంగారం చోరీ రెండు కళాకృతులకే పరిమితం కాలేదని సిట్ తెలిపింది. సన్నిధానం తలుపులకు ఉన్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది.
ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.50 కేజీల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చారని పేర్కొంది. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఓ రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరుచేశారని, ప్రస్తుతం అది బళ్లారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్ తన నివేదికలో పేర్కొన్నది. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో ఆలయ ప్రధాన పూజారి సహా 12 మందిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..